హర్యానా యువతితో పాక్‌ క్రికెటర్‌ నిఖా

20 Aug, 2019 15:16 IST|Sakshi

మరికొద్ది గంటల్లో మరో పాకిస్తానీ క్రికెటర్‌ భారత యువతిని పెళ్లాడనున్నాడు. పాకిస్తాన్‌ యువ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ హర్యానాకు చెందిన షమియా అర్జూతో మంగళవారం నిఖా చేసుకోనున్నాడు. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దుబాయ్‌లోని అట్లాంటిస్‌ పామ్‌ హోటల్లో వీరి వివాహం చాలా సింపుల్‌గా, అతికొద్దిమంది అతిథుల సమక్షంలో జరగనుందని హసన్‌ అలీ సన్నిహితుడు పేర్కొన్నాడు. 

ఇక హసన్‌ అలీ సోమవారం తన అత్యంత సన్నిహితులకు బ్యాచిలర్‌ పార్టీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ‘బ్యాచిలర్‌గా చివరి రాత్రి’అంటూ ట్వీట్‌ చేశాడు. హసన్‌ ట్వీట్‌పై సానియా మీర్జా స్పందించారు. ‘హసన్‌కు అభినందనలు, మీరిద్దరూ జీవితాంతం ప్రేమతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈసారి కలిసినప్పుడు మంచి ట్రీట్‌ ఇవ్వాలి’అంటూ సానియా శుభాకాంక్షలు తెలిపారు. ఇక భారత యువతను పెళ్లాడుతున్న నాలుగో పాక్‌ క్రికెటర్‌గా హసన్‌ నిలువనున్నాడు. గతంలో జహీర్ అబ్బాస్, మోహ్సిన్ హసన్ ఖాన్‌, షోయాబ్‌ మాలిక్‌లు కూడా భారత యువతులనే పెళ్లాడిన విషయం తెలిసిందే.

గత కొద్దికాలంగా హసన్‌ అలీ, షమియా అర్జూలు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చోసుకోబోతున్నారని అనేక వార్తలు వచ్చాయి. అయితే మొదట్లో ఈ వార్తలను హసన్‌ ఖండించాడు. అనంతరం తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, కానీ వివాహానికి సమయం పడుతుందని తెలిపిన విషయం తెలిసిందే. దుబాయ్‌లోనే వీరి ప్రేమ చిగురించిందని, కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా షమియాతో పరిచయం ఏర్పడిందని హసన్‌ పేర్కొన్నాడు. ఎరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన షమియా.. ప్రస్తుతం ఓ ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం చేస్తోంది. 

మరిన్ని వార్తలు