‘నన్ను ఎందుకు తీశావని ధోనిని అడగలేదు’

14 May, 2020 13:29 IST|Sakshi
మనోజ్‌ తివారీ(ఫైల్‌ఫొటో)

సెంచరీ చేసిన తర్వాత అవకాశం రాలేదు

ధోని నిర్ణయాన్ని గౌరవించా: తివారీ

న్యూఢిల్లీ: టీమిండియా తరఫున తాను సెంచరీ చేసిన తర్వాత వరుసగా పధ్నాలుగు మ్యాచ్‌ల్లో రిజర్వ్‌ బెంచ్‌లో కూర్చోబెట్టిన విషయాన్ని వెటరన్‌ క్రికెటర్‌ మనోజ్‌ తివారీ గుర్తు చేసుకున్నాడు. ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన తర్వాత రిజర్వ్‌ బెంచ్‌లో ఉంటానని అనుకోలేదన్నాడు. అప్పటి టీమిండియా కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంతోనే తనకు వరుస మ్యాచ్‌ల్లో చోటు దక్కలేదన్నాడు. తనను ఎందుకు తీశావనే విషయాన్ని ఇప్పటివరకూ ధోని అడగలేదన్నాడు. 2011 వరల్డ్‌కప్‌కు జట్టును సమయాత్తం చేసే క్రమంలో అలా చేశాడని అతని నిర్ణయాన్ని గౌరవించానన్నాడు. (ఐసీసీ ట్రోల్స్‌పై అక్తర్‌ సీరియస్‌ రియాక్షన్)

మరొకవైపు ధోని ప్రశ్నించే ధైర్యం తనకు లేకపోవడం కూడా ఒక కారణమన్నాడు.  2008లో అరంగేట్రం చేసిన మనోజ్‌ తివారీ.. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి జట్టు విజయంలో భాగమయ్యాడు. ఆ తర్వాత వరుసగా 14 మ్యాచ్‌ల్లో తివారీ ఆడే అవకాశం రాలేదు. 2012లో మళ్లీ అవకాశం వచ్చిన తివారీ ఒక హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మ్యాచ్‌లో 21 పరుగులు సాధించిన తివారీని రెండు సంవత్సరాలు పక్కన పెట్టేశారు. 2015లో భారత్‌ తరఫున చివరిసారి కనిపించాడు. 

‘విండీస్‌పై సెంచరీ సాధించడంతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. కానీ ఆ తర్వాత 14 మ్యాచ్‌ల్లోనూ నాకు తుది జట్టులో అవకాశం లభించలేదు. అయినప్పటికీ నేను అప్పటి కెప్టెన్ ధోనిని ప్రశ్నించలేదు. కెప్టెన్, కోచ్, టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాల్ని అప్పుడు గౌరవించాలనే ఆలోచనతో అడగలేకపోయా. ఆ మ్యాచ్‌లకు టీమ్ సమతూకం అలా ఉండాలని వారు నిర్ణయించారు. నాపై వేటు గురించి ధోనిని ఇంతవరకూ అడగలేదు’ అని తివారీ పేర్కొన్నాడు. టీమిండియా తరఫున 12 వన్డేలను తివారీ ఆడగా, మూడు అంతర్జాతీయ టీ20లు ఆడాడు.(‘రిచర్డ్స్‌.. నన్ను చంపేస్తానన్నాడు’)

మరిన్ని వార్తలు