డబుల్స్ విజేత వైష్ణవి-అర్చన జంట

17 Nov, 2014 01:29 IST|Sakshi
డబుల్స్ విజేత వైష్ణవి-అర్చన జంట

సింగిల్స్‌లో సాయమ్, వైష్ణవిలకు రన్నరప్

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఏపీ రాష్ట్రాల జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో బాలికల డబుల్స్ టైటిల్‌ను టాప్ సీడ్ వైష్ణవి-అర్చన (రంగారెడ్డి) జోడీ కైవసం చేసుకుంది. బాలుర సింగిల్స్‌లో సాయమ్ బోత్రా, బాలికల సింగిల్స్‌లో వైష్ణవి రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. విశాఖపట్టణంలోని పోర్ట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలతో ఈ ఈవెంట్ ముగిసింది. అండర్-17 బాలికల డబుల్స్ తుదిపోరులో టాప్‌సీడ్ కె.వైష్ణవి-బి.అర్చన జంట 22-20, 21-14తో రాష్ట్రానికే చెందిన రెండో సీడ్ శ్రీచందన (మెదక్)-ప్రణాలి కరణి (హైదరాబాద్) జంటపై గెలుపొందింది.

దీంతో ప్రణాలి జోడీ రన్నరప్‌గా నిలిచింది. బాలికల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ వైష్ణవి (రంగారెడ్డి) 16-21, 12-21తో రెండో సీడ్ ఎం.తనిష్క్ (గుంటూరు) చేతిలో పరాజయం చవిచూసింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో వైష్ణవి 21-18, 21-16తో హేమధ్రుతి (వైజాగ్)పై, తనిష్క్ 21-13, 21-8తో శ్రీచందన (మెదక్)పై నెగ్గారు. బాలుర సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ సాయమ్ బోత్రా (హైదరాబాద్) 22-20, 16-21, 12-21తో టాప్ సీడ్ జగదీశ్ (వైజాగ్) చేతిలో కంగుతిన్నాడు.

సెమీస్‌లో సాయమ్ 21-17, 20-22, 21-17తో రెండో సీడ్ ఆదిత్య బాపినీడు (ఖమ్మం)పై, జగదీశ్ 15-21, 21-17, 21-16తో చంద్రకుమార్ (తూర్పు గోదావరి)పై గెలుపొందారు. బాలుర డబుల్స్ ట్రోఫీని అంజన్ సాయి (పశ్చిమ గోదావరి)-ఎస్.కె.గౌస్ (నెల్లూరు) జోడీ గెలుచుకుంది.

మరిన్ని వార్తలు