సెమీస్‌లో భారత్‌కు షాక్‌

31 Aug, 2018 01:13 IST|Sakshi

పురుషుల హాకీ జట్టుకు  మలేసియా చేతిలో భంగపాటు

జకార్తా: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల సెమీఫైనల్లో అనూహ్య ఓటమి పాలైంది. గురువారం జరిగిన సెమీస్‌లో భారత్‌ 6–7తో మలేసియా చేతిలో షూటౌట్‌లో ఓడింది.మ్యాచ్‌ ఆరంభం నుంచి  ఆధిపత్యాన్ని కొనసాగించిన మన జట్టు చివరి నిమిషంలో ప్రత్య ర్థికి గోల్‌ సమర్పించుకొని మూల్యం చెల్లించుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–2 గోల్స్‌తో సమంగా నిలవడంతో షూటౌట్‌ ద్వారా విజేతను తేల్చారు. షూటౌట్‌లో తొలుత ఆకాశ్‌దీప్‌ సింగ్, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్స్‌ చేయగా... మన్‌ప్రీత్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్, ఎస్‌వీ సునీల్‌ విఫలమయ్యారు. గోల్‌ కీపర్, కెప్టెన్‌ శ్రీజేశ్‌ ప్రత్యర్థి ఆటగాళ్ల మూడు షాట్లను అడ్డుకోవడంతో మళ్లీ స్కోరు 2–2తో సమమైంది. దీంతో ‘సడన్‌ డెత్‌’ కొనసాగించారు. అందులోనూ ఇరు జట్లు వరుసగా నాలుగేసి గోల్స్‌ చేశాయి. ఐదో షాట్‌ను మలేసియా ఆటగాడు గోల్‌ పోస్ట్‌లోకి కొట్టగా... ఐదో షాట్‌ ఆడిన సునీల్‌ గోల్‌ కొట్టలేకపోవడంతో భారత్‌ ఓటమి ఖాయమైంది. అంతకుముందు మ్యాచ్‌లో భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (33వ ని.లో), వరుణ్‌ కుమార్‌ (40వ ని.లో) చెరో గోల్‌ చేశారు. మలేసియా తరఫున ఫైజల్‌ సారి (39వ ని.లో), మొహమ్మద్‌ రహీం (59వ ని.లో) చెరో గోల్‌ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 7 పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు రాగా అందులో రెండింటిని గోల్స్‌గా మలిచింది. మరో సెమీస్‌లో జపాన్‌ 1–0తో పాకిస్తాన్‌పై గెలిచి ఫైనల్‌ చేరింది. శనివారం స్వర్ణం కోసం మలేసియాతో జపాన్‌; కాంస్యం కోసం పాకిస్తాన్‌తో భారత్‌ తలపడతాయి.

ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎదురైన ప్రతీ ప్రత్యర్థిని చిత్తు చేస్తూ.... రికార్డు స్థాయిలో 76 గోల్స్‌తో సెమీస్‌కు చేరింది శ్రీజేశ్‌ సేన. ప్రత్యర్థులకు 3 గోల్స్‌ మాత్రమే ఇచ్చింది. కానీ అసలు పోరులో తమకంటే బలహీన ప్రత్యర్థి చేతిలో ఓడింది. ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభానికి ముందు... ఏషియాడ్‌లో స్వర్ణం నెగ్గి నేరుగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకున్న భారత్‌ ఆశలు ఈ ఓటమితో ఆవిరయ్యాయి. ఇక ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే మన జట్టు అర్హత టోర్నీలు ఆడాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు