మైక్‌ హెసన్‌కు కీలక పదవి

23 Aug, 2019 15:30 IST|Sakshi

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంచైజీల్లో ఒకటైన కింగ్స్‌ పంజాబ్‌ ప్రధాన కోచ్‌ పదవికి ఇటీవల గుడ్‌ బై చెప్పిన మైక్‌ హెసన్‌.. ఇక నుంచి రాయల్‌ చాలెంజర్స్‌  బెంగళూరు(ఆర్సీబీ)కి సేవలందించనున్నాడు. వచ్చే ఐపీఎల్‌కు సంబంధించి ముందుగానే ప్రక్షాళన చేపట్టిన ఆర్సీబీ.. మైక్‌ హెసన్‌ను డైరక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌గా ఎంపిక చేసింది. టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం పోటీపడ్డ హెసన్‌కు నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. మరోసారి రవిశాస్త్రినే కోచ్‌గా కొనసాగించేందుకు మొగ్గుచూపడంతో హెసన్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

మరొకవైపు బంగ్లాదేశ్‌ ప్రధాన కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసినా అక్కడ కూడా హెసన్‌కు చుక్కెదురైంది. కాగా, ఇప్పటివరకూ ఐపీఎల్‌ టైటిల్‌ సాధించలేకపోయిన ఆర్సీబీ.. హెసన్‌పై భారీ ఆశలు పెట్టుకుని తమ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరక్టర్‌గా నియమించింది. అదే సమయంలో ఆర్సీబీ ప్రధాన కోచ్‌గా ఆసీస్‌కు చెందిన సైమన్‌ కాటిచ్‌ను ఎంపిక చేసింది. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా పనిచేసిన కాటిచ్‌ను ఆర్సీబీ హెడ్‌ కోచ్‌గా నియమించుకుంది. టీ20 ఫార్మాట్‌లో అనేక జట్లతో పని చేసిన అనుభవం ఉన్న కాటిచ్‌కే పెద్ద పీట వేస్తూ నిర్ణయం తీసుకుంది.  దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టన్‌ స్థానంలో కాటిచ్‌ను ఎంపిక చేస్తూ ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు