మెరిసిన హిమదాస్‌

26 Aug, 2018 18:10 IST|Sakshi
నాసెర్‌ సల్వా, హిమ దాస్‌

మారథాన్‌లో భారత్‌కు రెండు రజతాలు

జకార్త : ఏషియన్‌ గేమ్స్‌లో హిమదాస్‌ సత్తా చాటింది. హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఈ అస్సాం అమ్మాయి రజతం కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్‌ 400 మీటర్ల విభాగంలో 50.79 సెకన్లలో పరుగును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత అథ్లెట్‌ నిర్మల నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. ఆమె 52.96 సెకన్లలో పరుగును పూర్తి చేసి తృటిలో కాంస్యాన్ని చేజార్చుకుంది. ఇక అగ్రస్థానంలో నిలిచిన బెహ్రెయిన్‌ క్రీడాకారిణి నాసెర్‌ సల్వా 50.09 సెకన్లలో పరుగును పూర్తిచేసి స్వర్ణం కైవసం చేసుకుంది. కజకిస్తాన్‌ క్రీడాకారిణి మికినా ఎలినా 52.63 సెకన్లలో పరుగును పూర్తి చేసి కాంస్యం దక్కించుకుంది.

చదవండి: హిమదాస్‌ టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా?

హిమదాస్‌ ఇటీవల అండర్‌–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌ 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం నెగ్గి దేశప్రజల మన్ననలు పొందిన విషయం తెలిసిందే. దీంతో జకార్తాలోనూ ఆమె ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఇక 100 మీటర్ల విభాగంలో భారత రన్నర్‌ ద్యూతీ చంద్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది.

పురుషుల విభాగంలో..
పురుషుల 400 మీటర్ల విభాగంలో సైతం భారత్‌కు రజతం వరించింది. భారత అ‍థ్లెట్‌ యహియా మొహహ్మద్‌ 45.69 సెకన్లలో పరుగును పూర్తి చేసి రజతం దక్కించుకున్నాడు. ఖతర్‌ అథ్లెట్‌ హసన్‌ అబ్దెల్లా(44.89) స్వర్ణం దక్కించుకోగా.. బెహ్రెయిన్‌ క్రీడాకారుడు కమీస్‌ అలీ (45.7) కాంస్యం సొంత చేసుకున్నాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత రన్నర్‌ ఆరోకియారాజీవ్‌ (45.84) నాలుగో స్థానంలో నిలిచాడు.  దీంతో భారత పతకాల సంఖ్య  7 స్వర్ణాలు,9 రజతాలు, 19 కాంస్యలతో కలుపుకొని 35కు చేరుకుంది. ప్రస్తుతం పతకాల జాబితాలో భారత్‌ 9వ స్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు