హిమాన్షు, నమితలకు టైటిల్స్‌

15 Jul, 2019 10:15 IST|Sakshi

ప్రభుత్వ రంగ సంస్థల బ్యాడ్మింటన్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత ప్రభుత్వ రంగ సంస్థల బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) క్రీడాకారులు హిమాన్షు తివారీ, నమిత పథానియా విజేతలుగా నిలిచారు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో భాస్కర్‌ చక్రవర్తి (ఆర్‌బీఐ)పై హిమాన్షు... మహిళల తుది పోరులో లీనా ధాప్రే (ఎల్‌ఐసీ)పై నమిత గెలుపొంది టైటిళ్లను కైవసం చేసుకున్నారు.

మరోవైపు డబుల్స్‌ విభాగంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) క్రీడాకారులు సత్తా చాటారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో అంజన్‌–రంజన్‌ బోర్గోహైన్‌ (ఆర్‌బీఐ) జోడీపై శివమ్‌ శర్మ–సంజిత్‌ (ఆర్‌బీఐ) జంట గెలుపొందగా... మహిళల డబుల్స్‌ తుదిపోరులో లీనా–వరద దీక్షిత్‌ (ఎల్‌ఐసీ) జంటపై మనీషా–రసిక రాజే (ఆర్‌బీఐ) ద్వయం నెగ్గి చాంపియన్‌లుగా నిలిచాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఎల్‌ఐసీ సౌత్‌జోన్‌ మేనేజర్‌ మినీ ఐపే ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.  

మరిన్ని వార్తలు