భారత్‌ అజేయంగా

12 Apr, 2019 04:42 IST|Sakshi

4–0తో సిరీస్‌ కైవసం 

మలేసియాతో ద్వైపాక్షిక హాకీ టోర్నీ

కౌలాలంపూర్‌: మలేసియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు అజేయంగా నిలిచింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లోనూ భారత్‌ 1–0తో మలేసియాపై గెలుపొందింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను ఆట 35వ నిమిషంలో నవ్‌జ్యోత్‌ కౌర్‌ సాధించింది. ఈ సిరీస్‌లో భారత్‌ వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 3–0, 5–0, 4–4, 1–0 గోల్స్‌తో ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఐదో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించి 4–0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆరంభంలో ఇరు జట్లు పోటాపోటీగా తలపడటంతో రెండు క్వార్టర్ల పాటు ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు.

అయితే మూడో క్వార్టర్‌లో నవ్‌జ్యోత్‌ కౌర్‌ అద్భుత ఫీల్డ్‌ గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. ఆధిక్యాన్ని దక్కించుకున్న భారత మహిళలు ప్రత్యర్థికి గోల్‌ చేసే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ విజయంపై కోచ్‌ జోయెర్డ్‌ మరీనే మాట్లాడుతూ ‘ భారత్‌ గోల్‌ చేసే అవకాశాలు సృష్టించుకున్న తీరు అభినందనీయం. ప్రత్యర్థి గోల్‌ ఏరియాలోకి చాలా సార్లు దూసుకెళ్లి వారిపై ఒత్తిడి పెంచాం. కానీ పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచలేకపోతున్నాం. దీనిపై దృష్టి సారించాలి’ అని పేర్కొన్నాడు. ఓవరాల్‌గా ఈ టూర్‌ యువ క్రీడాకారిణులకు మంచి అనుభవాన్ని ఇచ్చింది’ అన్నారు.

మరిన్ని వార్తలు