హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్
న్యూఢిల్లీ: పురుషుల హాకీ వరల్డ్ లీగ్ (హెచ్డబ్ల్యూఎల్) ఫైనల్లో ఆతిథ్య భారత జట్టుకు కఠిన డ్రా ఎదురైంది. గురువారం అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఈ షెడ్యూల్ను విడుదల చేసింది. డిసెంబర్ 1 నుంచి 10 వరకు భువనేశ్వర్లో జరిగే ఈ లీగ్లో భారత్ పూల్ ‘బి’లో చోటు దక్కించుకుంది. అయితే ఈ పూల్లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతోపాటు ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన జర్మనీ, ప్రపంచ ఏడో ర్యాంకర్ ఇంగ్లండ్ ఉన్నాయి.
1న జరిగే ప్రారంభ మ్యాచ్లో భారత జట్టు ఆసీస్ను ఢీకొంటుంది. ఆ తర్వాత 2న ఇంగ్లండ్తో, 4న జర్మనీతో టీమిండియా తమ పూల్ మ్యాచ్లు ఆడుతుంది. ఇక పూల్ ‘ఎ’లో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్ జట్లు ఉన్నాయి. 1 నుంచి 5 వరకు జరిగే పూల్ మ్యాచ్ల అనంతరం 6, 7న క్వార్టర్స్; ఆ తర్వాత 8, 9న సెమీస్; 10న ఫైనల్ జరుగుతుంది.