లిన్‌ డాన్‌కు ప్రణయ్‌ షాక్‌ 

4 Jul, 2018 01:27 IST|Sakshi

బ్యాడ్మింటన్‌ దిగ్గజంపై రెండోసారి జయభేరి

ఇండోనేసియా ఓపెన్‌ టోర్నీ   

జకార్తా: భారత షట్లర్‌ హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ తన కెరీర్‌లో మరో అపూర్వ విజయాన్ని సాధించాడు. ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో చైనా దిగ్గజం లిన్‌ డాన్‌ను కంగుతినిపించాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత లిన్‌ డాన్‌తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 21–15–9–21, 21–14తో నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. లిన్‌ డాన్‌పై ప్రణయ్‌కిది రెండో విజయం. 2015 ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ ప్రణయ్‌ తొలి రౌండ్‌లోనే లిన్‌ డాన్‌ను ఓడించాడు.

ఇతర పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ ల్లో సమీర్‌ వర్మ 21–19, 12–21, 22–20తో రస్ముస్‌ గెమ్కె (డెన్మార్క్‌)పై నెగ్గగా... సాయిప్రణీత్‌ 10–21, 13–21తో వాంగ్‌ జు వీ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత స్టార్‌ సైనా నెహ్వాల్‌ 21–12, 21–12తో దినర్‌ ద్యా అయుస్టిన్‌ (ఇండోనేసియా)పై అలవోక విజయం సాధించింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో మేఘన–పూర్వీషా జోడీ 11–21, 18–21తో అగత ఇమానుయెలా–సిటి ఫదియాసిల్వ (ఇండోనేసియా) జంట చేతిలో, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 8–21, 15–21తో హిరొయుకి–యుత వతనబె (జపాన్‌) జంట చేతిలో ఓడిపోయాయి. 

మరిన్ని వార్తలు