హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సంచలన విజయం

3 Jul, 2018 16:19 IST|Sakshi

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సంచలన విజయం సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రణయ్‌ 21-15, 9-21, 21-14 తేడాతో ఐదుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ లిన్‌డాన్‌(చైనా)కు షాకిచ్చాడు. 59 నిమిషాల పోరులో ప్రణయ్‌ ఆద్యంత ఆకట్టుకుని తొలి రౌండ్‌ అడ్డంకిని అధిగమించాడు.

మొదటి గేమ్‌ను గెలిచిన ప్రణయ్‌.. రెండో గేమ్‌ను భారీ తేడాతో కోల్పోయాడు. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రణయ్‌ సత్తాచాటి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.  ఇది లిన్‌డాప్‌పై ప్రణయ్‌కు రెండో విజయం. ఈ ఇద్దరూ ఇప్పటివరకూ మూడుసార్లు తలపడితే రెండు సందర్భాలో ప్రణయ్‌నే విజయం వరించింది. ప్రణయ్‌ రెండో రౌండ్‌లో వాంగ్‌ జు వియ్‌(చైనీస్‌ తైపీ)తో తలపడనున్నాడు.
 

మరిన్ని వార్తలు