తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్లో హైదరాబాద్ బుల్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బుల్స్ 35– 29తో నల్లగొండ ఈగల్స్పై గెలుపొందింది. ఇప్పటివరకు లీగ్లో మూడు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్కు ఇదే తొలి గెలుపు. ఈ సీజన్లో ఒక్క విజయాన్ని కూడా అందుకోని నల్లగొండ ఈగల్స్ జట్టు పట్టుదలగా ఆడటంతో తొలి అర్ధభాగంలో 18–12తో హైదరాబాద్ బుల్స్ వెనకబడే ఉంది.
అయితే రెండో అర్ధభాగంలో అనూహ్యంగా పుంజుకున్న హైదరాబాద్ ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమైంది. రైడర్ హన్మంతు, డిఫెండర్ శ్రీధర్ చురుగ్గా కదలడంతో విజయం హైదరాబాద్ సొంతమైంది. మరో మ్యాచ్లో వరంగల్ వారియర్స్ 61–25తో మంచిర్యాల టైగర్స్పై గెలుపొందింది. నేటి మ్యాచ్ల్లో గద్వాల్ గ్లాడియేటర్స్తో కరీంనగర్ కింగ్స్, రంగారెడ్డి రైడర్స్తో పాలమూరు పాంథర్స్ తలపడతాయి.