జోరు కొనసాగిస్తారా?

19 Apr, 2017 01:59 IST|Sakshi
జోరు కొనసాగిస్తారా?

నేడు ఢిల్లీతో తలపడనున్న సన్‌రైజర్స్‌..
ఉత్సాహంలో వార్నర్‌సేన
గెలుపే లక్ష్యంగా బరిలోకి ఢిల్లీ


హైదరాబాద్‌: స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. బుధవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. ఇరుజట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో హోరాహోరీగా పోరాడడంతో ఫైనల్‌ ఓవర్లో ఆయా మ్యాచ్‌ల ఫలితం వచ్చాయి. ఈక్రమంలో బుధవరం జరిగే మ్యాచ్‌ కూడా ఆసక్తికరంగా సాగనుంది.

సొంతగడ్డపై హైదరాబాద్‌ జోరు..
ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ మూడు విజయాలు సాధించింది. అయితే ఈ విజయాలన్నీ సొంతగడ్డపై సాధించినవి కావడం విశేషం. తొలిమ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ లయన్స్‌పై నెగ్గిన సన్‌రైజర్స్‌.. వేరే వేదికలపై ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో పరాజయం పాలైంది. అయితే సోమవారం సొంతగడ్డపై కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో నెగ్గింది. దీంతో తమకెంతో అచ్చోచ్చిన ఉప్పల్‌ మైదానంలో ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో వార్నర్‌సేన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. తాజా విజయంతో ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ మూడో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓ మాదిరిస్కోరునే అద్భుత బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ కాపాడుకుంది. తొలుత బ్యాటింగ్‌లో జట్టంతా విఫలమైనా కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అజేయ అర్ధసెంచరీతో టీమ్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

అతనికి వికెట్‌ కీపర్‌ నమన్‌ ఓజా చక్కని సహకారం అందించాడు. బ్యాటింగ్‌లో మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్, యువరాజ్‌ సింగ్‌ సత్తా చాటాల్సిన అవసరముంది. మరోవైపు మోజెస్‌ హెన్రిక్స్, దీపక్‌ హుడా రాణించాల్సిన అవసరముంది. ఇక టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్‌ లైనప్‌ కలిగిన జట్లలో సన్‌రైజర్స్‌ ఒకటి.  ఈ సీజన్‌లో కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే 15 వికెట్లతో చెలరేగిన భువనేశ్వర్‌ ‘పర్పుల్‌ క్యాప్‌’ను సొంతం చేసుకున్నాడు. ఇక పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన భువీ.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును కైవసం చేసుకున్నాడు.  మరోవైపు టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వార్నర్‌ చేతిలోనే ‘ఆరెంజ్‌ క్యాప్‌’ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు రకాల క్యాప్‌లను సన్‌రైజర్స్‌ జట్టే తన ఆధీనంలో ఉంచుకుంది. బౌలర్లలో అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ ఆకట్టుకుంటున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో పరుగులు సమర్పిచుకున్నా కీలక సమయంలో వికెట్లు తీసి జట్టును మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. మరోవైపు సీజన్‌లో తొలిమ్యాచ్‌ ఆడిన ఆఫ్గాన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీ కూడా ఆకట్టుకున్నాడు.

హెన్రిక్స్, సిద్ధార్థ్‌ కౌల్‌ పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో క్రమశిక్షణాయుతమైన బౌలింగ్‌తో సన్‌ బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. మరోవైపు ఢిల్లీతో మ్యాచ్‌లో వెటరన్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా తుదిజట్టులోకి వచ్చే అవకాశముంది. పంజాబ్‌తోమ్యాచ్‌లో విఫలమైన బరీందర్‌ శరణ్‌ స్థానంలో నెహ్రా ఆడతాడు. మరోవైపు బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ బెంచ్‌కే పరిమితమవ్వచ్చు. ఏదేమైన వరుసగా రెండు పరాజయాల తర్వాత విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్‌ అదేజోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది.

ఢిల్లీకి బ్యాటింగే సమస్య..
మరోవైపు ఈ సీజన్‌లో ఢిల్లీ ప్రయాణం పడుతూ లేస్తూ నడుస్తోంది. ఒక మ్యాచ్‌లో నెగ్గడం తర్వాతి మ్యాచ్‌లోనే ఓడడం జట్టుకు ఆనవాయితీగా వస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆఖరివరకు పోరాడి ఆకట్టుకుంది. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్‌ కొంచెం బలహీనంగా కన్పిస్తోంది. స్టార్‌ ప్లేయర్లు జట్టులో లేకపోవడంతో సాదాసీదాగా తయారైంది. అయితే ఈ సీజన్‌లో నమోదైన ఏకైక సెంచరీ ఢిల్లీ ఆటగాడే చేయడం గమనార్హం. రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌పై అద్భుత ఆటతీరుతో సంజూ శామ్సన్‌ సెంచరీని నమోదు చేశాడు. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ ఓ మోస్తరుగా రాణించారు. శుభారంభం దక్కినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నారు.

శామ్సన్‌తోపాటు శామ్‌ బిల్లింగ్స్, కరుణ్‌ నాయర్, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, ఏంజెలో మాథ్యూస్, క్రిస్‌ మోరిస్‌ లాంటి ప్లేయర్లతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బాగానే ఉంది. ఈ సీజన్‌లో జట్టు తరఫున అత్యధిక పరుగు లు చేసిన ఆటగాళ్లుగా శామ్సన్, పంత్‌లు కొనసాగుతున్నారు. మరోవైపు బౌలింగ్‌ విషయానికొస్తే భారత దిగ్గజ బౌలర్‌ జహీర్‌ఖాన్‌ జట్టుకు నేతృత్వం వహిస్తున్నాడు. జట్టు తరఫున క్రిస్‌ మోరిస్‌ ఎనిమిది వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించాడు. ప్యాట్‌ కమ్మిన్స్, జహీర్‌ ఏడేసి వికెట్లు తీయగా.. అమిత్‌ మిశ్రా ఐదు వికెట్లతో ఫర్వాలేదపిస్తున్నాడు. మహ్మద్‌ షమీ విఫలమవుతున్నాడు.

మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో విఫలమైన మాథ్యూస్‌కు మరో చాన్స్‌ దక్కవచ్చు. ఇక కోల్‌కతాతో జరిగిన చివరిమ్యాచ్‌ విషయానికొస్తే ఆరంభంలో కోల్‌కతాను బాగానే కట్టడి  చేసిన ఢిల్లీ బౌలర్లు.. అనంతరం పట్టు సడలించారు. దీంతో యూసుఫ్‌ పఠాన్‌–మనీశ్‌ పాండే జంట మ్యాచ్‌ను ఢిల్లీ నుంచి లాగేసుకున్నారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుడదని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ఓవరాల్‌గా నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. రెండు విజయాలు, రెండు పరాజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌పై విజయం సాధించి తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ఆ జట్టు యోచిస్తోంది.

మరిన్ని వార్తలు