ఆంధ్రపై హైదరాబాద్ గెలుపు

31 May, 2014 00:44 IST|Sakshi

సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్
 సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. కొంపల్లిలోని శివ శివాని ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం ప్రారంభమైన ఈ పోటీల టీమ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు తొలి రౌండ్‌లో ఆంధ్ర జట్లపై గెలుపొందగా, రెండో రౌండ్‌లో పురుషుల జట్టు కర్ణాటక చేతిలో ఓటమి పాలైంది. ఆంధ్రతో జరిగిన పురుషుల తొలి రౌండ్‌లో రవిందర్ గౌడ్ 25-0, 25-4తో మనోహర్‌పై, నవీన్ 25-0, 18-21, 25-4తో రమణపై గెలిచి హైదరాబాద్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించారు.
 
 అయితే డబుల్స్‌లో ఎస్.సాయిబాబా-యు.నరేశ్ జోడి 10-25, 5-23తో వై.శ్రీనివాసరావు-టి.సురేశ్ జంట చేతిలో ఓటమి పాలవడంతో హైదరాబాద్ ఆధిక్యం 2-1కి తగ్గింది. అనంతరం కర్ణాటకతో జరిగిన రెండో రౌండ్‌లో హైదరాబాద్ 1-2తో ఓడింది. ఇక మహిళల తొలిరౌండ్ పోటీల్లో హైదరాబాద్ 2-1తో ఆంధ్రను ఓడించింది.
 
 జి.మాధవి 0-25, 7-22తో రాజ్యలక్ష్మి చేతిలో ఓడినా, సవితా దేవి 25-0, 25-0తో మాధురిపై, పద్మజ-శ్వేత జోడి 25-0, 25-1తో జ్యోత్స్నా రవళి-శ్రావణి జంటను ఓడించడంతో హైదరాబాద్ గెలుపొందింది. మహిళల తొలి రౌండ్‌లోని ఇతర మ్యాచ్‌ల్లో తమిళనాడు 3-0తో పాండిచ్చేరిపై, కర్ణాటక 3-0తో ఆంధ్రపై విజయం సాధించాయి. పురుషుల తొలి రౌండ్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో తమిళనాడు 3-0తో పాండిచ్చేరిపై, కర్ణాటక 2-1తో కేరళపై గెలుపొందాయి.
 
 ఇక పురుషుల రెండో రౌండ్‌లో తమిళనాడు 3-0తో ఆంధ్రపై, కేరళ 2-1తో పాండిచ్చేరిపై గెలుపొందాయి. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ సీహెచ్.మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, శివ శివాని ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఆరతి సంపతి, అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్.కె.శర్మ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు