-
మాంచెస్టర్: తన భార్య కంటే టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనియే ఎక్కువ ఇష్టమని పాకిస్తాన్ అభిమాని మహ్మద్ బషీర్ అకా (చికాగో చాచా) గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ధోని-చికాగో చాచాల మధ్య బంధం ఈనాటిది కాదు. 2011 ప్రపంచకప్లో భారత్, పాక్ మధ్య జరిగిన సెమీఫైనల్ పోరుతో ఆ బంధం బలపడింది. నాడు మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కోసం వచ్చిన 63 ఏళ్ల చికాగో చాచాకు ధోని దగ్గరుండీ మరీ టిక్కెట్టు ఇప్పించాడు. ఇప్పుడు వరల్డ్క్పలో ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం చికాగో నుంచి మాంచెస్టర్ చేరుకున్నాడు. దాయాదుల మ్యాచ్కు ప్రస్తుతం బ్లాక్లో టిక్కెట్ ధర భారీ రేట్లకు అమ్ముతున్నారు.
ఇంత మొత్తం పెట్టి తాను టిక్కెట్ కొనుగోలు చేయలేననీ, అంతా ధోనినే చూసుకుంటాడని చాచా నమ్మకంతో ఉన్నాడు. ‘ధోనికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. ఇప్పుడు ధోని చాలా బిజీగా ఉంటాడు. కాకపోతే ధోనికి ఫోన్ మెసేజ్ల ద్వారా టచ్లో ఉంటా. చాలారోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ధోనిని కలిశా. వరల్డ్కప్ మ్యాచ్కు టిక్కెట్ ఇప్పిస్తానని అప్పుడు నాకు హామీ ఇచ్చాడు. ప్రతిసారీ నాకు టిక్కెట్ ఇస్తుంటాడు. ధోనిసాయంతో ఈసారి కూడా మ్యాచ్ వీక్షిస్తా’ అని బషీర్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్కు చెందిన సదరు ఎంఎస్ ధోని అభిమాని చికాగోలో నివసిస్తుండటంతో అతను చికాగో చాచాగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం చికాగోలో ఓ రెస్టారెంట్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.