నన్ను ‘కాలూ’ అని పిలిచారు

8 Jun, 2020 00:04 IST|Sakshi

ఐపీఎల్‌ సందర్భంగా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశారన్న డారెన్‌ స్యామీ

కింగ్‌స్టన్‌: ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా తాను కూడా జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ స్యామీ అన్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్‌ తిసారా పెరీరా వర్ణ వివక్షకు గురయ్యాడని తెలిపాడు. ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో నన్ను, పెరీరాను ‘కాలూ... కాలూ’ (నల్లోడు) అని పిలిచేవారు. అప్పుడు దానర్థం మాకు తెలిసేది కాదు. భారత్‌లో ‘కాలూ’ అంటే ‘బలమైన వ్యక్తి’ అని పిలుస్తున్నారేమో అనుకునేవాడిని. కానీ ఈ మధ్యే ఆ పదానికి అర్థం తెలుసుకున్నా. చాలా బాధగా ఉంది’ అని స్యామీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొన్నాడు. అయితే ఏ ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా తాను ఈ వివక్షను ఎదుర్కొన్నాడో స్యామీ తెలపలేదు. జెంటిల్‌మెన్‌ క్రీడ క్రికెట్‌లో ఉన్న జాత్యాంహకారం పట్ల తీవ్రంగా పరిగణించాలని ఇటీవలే అతను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి విజ్ఞప్తి చేశాడు. ఇప్పటివరకు 38 టెస్టులు, 126 వన్డేలు, 68 టి20లు ఆడిన స్యామీ.... విండీస్‌కు కెప్టెన్‌గా రెండు టి20 ప్రపంచకప్‌లను అందించాడు.

మరిన్ని వార్తలు