ఆ ఘనత కోహ్లిదే: బుమ్రా

1 Sep, 2019 16:26 IST|Sakshi

జమైకా: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తాను హ్యాట్రిక్‌ సాధించిన ఘనతకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినే కారణమని టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పేర్కొన్నాడు.  హ్యాట్రిక్‌ అందుకునే క్రమంలో విండీస్‌ ఆటగాడు రోస్టన్‌ ఛేజ్‌ను నాటౌట్‌గా ప్రకటించడంతో దీనిపై థర్డ్‌ అంపైర్‌ అప్పీల్‌ కోసం వెళ్లామని, ఇది సక్సెస్‌ కావడంతోనే అరుదైన ఘనత లిఖించినట్లు చెప్పాడు. ‘  ఛేజ్‌కు సంధించిన బంతి ప్యాడ్లకు తగలడంతో అప్పీల్‌ చేసినా ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. అయితే నిజంగా ఏమి జరిగిందో నాకు తెలియదు.. నేను అప్పీల్‌ చేద్దామని అనుకోలేదు. నేను ఇంకా సందిగ్థంలోనే ఉన్నా. కోహ్లి సమీక్ష కోరడంతో మాకు అనుకూలంగా వచ్చింది. హ్యాట్రిక్‌ ఘనత కోహ్లిదే’ అని బుమ్రా పేర్కొన్నాడు.

తొలి టెస్టులో విండీస్‌కు తన పేస్‌ రుచి చూపించిన బుమ్రా.. రెండో టెస్టులోనూ ఆతిథ్య జట్టును కోలుకోనివ్వలేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌ పనిపట్టాడు. ఇందులో ఓ హ్యాట్రిక్‌ ఉండటం విశేషం. బుమ్రా ధాటికి ఇద్దరూ బ్యాట్స్‌మెన్‌ పరుగులేమి చేయకుండా వెనుదిరగగా.. మరో ఇద్దరు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆతిథ్య జట్టు పూర్తిగా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ 33 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.  భారత తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (225 బంతుల్లో 111; 16 ఫోర్లు) శతకానికి తోడు ఇషాంత్‌ శర్మ (80 బంతుల్లో 57; 7 ఫోర్లు) కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటడంతో భారత్‌ నాలుగు వందల స్కోరును దాటింది.

మరిన్ని వార్తలు