న్యూఢిల్లీ: ‘జట్టులో ఆటకన్నా ఎవరు గొప్ప కాదు. అది కెప్టెన్ విరాట్ అయినా, నేనైనా.. ఇంకెవరైనా అందరం జట్టుకోసమే ఆలోచించేవాళ్లమే. జట్టులో విభేదాలుంటే అన్ని ఫార్మాట్లలో ఇంత నిలకడగా, ఇన్నేళ్లు ఏ జట్టు రాణించేది కాదు. డ్రెస్సింగ్ రూంలోని ఓ వ్యక్తిగా చెబుతున్నా జట్టులో ఎలాంటి విభేదాలు లేవు’ అని వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరేముందు ప్రధాన కోచ్ రవిశాస్త్రి చెప్పిన మాట ఇది. కోహ్లి-రోహిత్తో విభేదాల వార్తల నేపథ్యంలో రవిశాస్త్రి ఇలా స్పందించాడు.( ఇక్కడ చదవండి: అంతా నాన్సెన్స్ : రవిశాస్త్రి)
అయితే తాజాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. ‘నేను కేవలం జట్టు కోసమే కాదు.. దేశం కోసమూ ఆడతా’ అంటూ ట్వీట్ చేశాడు.బ్యాటింగ్కు వస్తున్న ఫొటోను పోస్టు చేశాడు. శాస్త్రి వ్యాఖ్యలకు కౌంటర్గా దేశం కోసం తాను దేనికైనా సిద్ధమే అనే విధంగా రోహిత్ పంచ్ ఇచ్చాడని నెటిజన్లు భావిస్తున్నారు. వరల్డ్కప్లో సెమీస్ ఓటమి తర్వాత టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు పొడసూపాయంటూ ఊహాగానాలు బలంగా వినిపించాయి. కానీ, వెస్టిండీస్ టూర్కు బయల్దేరే ముందు కోహ్లి వాటిని కొట్టిపడేశాడు. అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించాడు.
I don’t just walk out for my Team. I walk out for my country. pic.twitter.com/S4RFkC0pSk
— Rohit Sharma (@ImRo45) July 31, 2019