అప్పుడు నేను ఆశ్చర్యపోతా: వాట్సన్‌

2 Aug, 2018 10:54 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా టెస్టు సిరీస్‌ గెలవకపోతే అది కచ్చితంగా తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందంటున్నాడు ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌.  ప‍్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న వాట్సన్‌.. భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల టెస్టు సిరీస్‌ గురించి మాట్లాడాడు.

‘ఇంగ్లండ్‌తో టెస్టులు ఆడేందుకు టీమిండియా జట్టు ఎంపికకు చాలా అవకాశాలు ఉన్నాయి. గతంలో భారత జట్టు ఇంగ్లిష్‌ గడ్డపై ఎలా ఆడింది, ఎన్ని విజయాలు సాధించిందో ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై భారత జట్టు తప్పకుండా సిరీస్‌ గెలుస్తుందనే నమ్మకం నాకు ఉంది. టెస్టు సిరీస్‌ గెలవకపోతే అప్పుడు నేను ఆశ్చర్యపోతా.

2014లో ఇంగ్లండ్‌ పర్యటన ద్వారా విరాట్‌ కోహ్లికి నేర్చుకునే అవకాశం దక్కిందనే చెప్పుకోవాలి. అతని టెక్నిక్‌ అసాధారణం. ఎలాంటి పరిస్థితులకైనా సులువుగా అలవాటు పడిపోతాడు. ఆస్ట్రేలియాలో నేను అతడి నుంచి అది బాగా గమనించాను. కేఎల్‌ రాహుల్‌ ఆడుతుంటే చూడటం చాలా ఇష్టం. ఫాస్ట్‌ బౌలర్లను చాలా తెలివిగా, సులువుగా ఎదుర్కొంటాడు. అన్ని రకాల షాట్లను ఆడేందుకు ప్రయత్నిస్తాడు. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడు’ అని వాట్సన్‌ చెప్పాడు.
 

మరిన్ని వార్తలు