గంగూలీ చేసిందేమీ లేదు!

20 Jul, 2020 13:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌(ఐసీఏ)లో డైరెక్టర్లతో ఏమీ చర్చించకుండానే బహిరంగ విమర్శలు చేస్తున్న ప్రెసిడెంట్‌ అశోక్‌ మల్హోత్రా మరోసారి వివాదానికి తెరలేపారు. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్‌ గంగూలీ ఇప్పటివరకూ 10 నెలల కాలాన్ని పూర్తి చేసుకున్నా వృద్ధాప్యంలో ఉన్న మాజీ క్రికెటర్ల డిమాండ్ల విషయంలో చేసేందేమీ లేదంటూ బహిరంగ విమర్శలు చేశారు. సోమవారం  పీటీఐతో మాట్లాడుతూ.. ‘ గంగూలీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మాజీ క్రికెటర్లకు ఇప్పటివరకూ ఎటువంటి మేలు జరగలేదు. భర్తలు కోల్పోయిన మాజీ క్రికెటర్ల భార్యలు దగ్గర్నుంచీ, మెడికల్‌ ఇన్సురెన్స్‌ను ఐదు నుంచి పది లక్షల రూపాయలకు పెంచమన్న ప్రతిపాదన కూడా అమలుకు నోచుకోలేదు. (‘రిషభ్‌ పంత్‌ను చూస్తే బాధేస్తోంది’)

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ 10 నెలల నుంచి కొనసాగుతున్నా మాజీ క్రికెటర్లకు అందించాల్సిన చేయూతలో ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. మాజీ క్రికెటర్ల సంక్షేమం కోసం పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించండి. చాలా మంది ఇప్పటికే 70 ఏళ్ల ఒడిలో ఉన్నారు. వారిని ఇంకా నిరీక్షించాలే చేయడం తగదు.. వారు కూడా వెయిట్‌ చేసే పరిస్థితి కూడా ఉండదు గంగూలీతో పాటు ఐసీఏ ప్రతినిధులుగా ఉన్న శాంతా రంగస్వామి, అన్షుమన్‌ గైక్వాడ్‌లు మా డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలి. పరిస్థితిని అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా’ అని అశోక్‌ మల్హోత్రా  విజ్ఞప్తి చేశారు. అశోక్‌  మల్హోత్రా బీసీసీఐకి అభ్యర్ధించిన దాంట్లో మానవతా కోణం ఉన్నప్పటికీ బహిరంగంగా చెప్పడమే వివాదంగా మారుతూ వస్తోంది. ప్రధానంగా ఐసీఏలో డైరెక్టర్లతో ఎవరితో కనీసం చర్చించకుండానే మల్హోత్రా ఇలా మీడియా ఎదుట మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఐసీఏలో డైరెక్టర్లంతా తమకు ఈ విషయంతో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తూ మల్హోత్రాను దోషిగా నిలబెట్టే యత్నం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు