‘గంగూలీ.. మీరు ఒప్పు కోవద్దు’

9 Jan, 2020 16:54 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌పై ఇప్పటికే పలువురు దిగ్గజాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఏ నిర్ణయం తీసుకుంటాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి సానుకూల స్పందన వస్తే అందుకు ఐసీసీ కూడా మరో అడుగు ముందుకేసే అవకాశం ఉంది. బీసీసీఐ అధ్యక్షునిగా గంగూలీ నియమించబడ్డ తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు నాలుగు రోజుల టెస్టుపై కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడేమో అని సగటు అభిమాని మదిలో ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో ఇండియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఐసీఏ) తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే సదురు బాడీ సభ్యులు గంగూలీకి ముందుగానే తమ విన్నపాన్ని తెలియజేశారు. ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని గంగూలీని కోరారు. (ఇక్కడ చదవండి: బీసీసీఐ ఒప్పుకునే ప్రసక్తే ఉండదు: అక్తర్‌)

‘గంగూలీ.. నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌కు ఒప్పుకోవద్దు. మనం ఐదో రోజు టెస్టు మ్యాచ్‌ల ద్వారా  ఫలితాల్ని చూడటం మొదలుపెట్టాం. ఇప్పుడు పింక్‌ బాల్‌ టెస్టును నిర్వహించి కూడా సక్సెస్‌ అయ్యాం. ఆపై వెంటనే ఇంత మార్పు ఏమిటి. వరుసగా మార్పులు చేసుకుంటూ పోతే మంచిది కాదు. మనం ఏమైనా షెడ్యూలింగ్‌ విండో కోసం ప్రయత్నిస్తున్నామా. మనకి సాధ్యమైనంత వరకూ ఎక్కువ టీ20 క్రికెట్‌ను నిర్వహిద్దాం. అంతే కానీ నాలుగు రోజుల టెస్టు వద్దు’ అని గంగూలీకి ఐసీఏ ప్రెసిడెంట్‌ అశోక్‌ మల్హాత్రా విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు