ఈ భార‌త క్రికెట‌ర్ రియ‌ల్ హీరో: ఐసీసీ

29 Mar, 2020 14:29 IST|Sakshi

భార‌త మాజీ క్రికెట‌ర్‌ జోగింద‌ర్ శ‌ర్మ‌.. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డికి న‌డుం బిగించాడు. ఆయ‌న‌ సొంత రాష్ట్ర‌మైన హ‌ర్యాణాలో ఖాకీ దుస్తులు ధ‌రించి వీధుల్లో డ్యూటీ చేస్తున్న అత‌ని ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై అంత‌ర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్పందిస్తూ అత‌డిని రియ‌ల్ హీరోగా అభివ‌ర్ణించింది. ప్ర‌పంచమంతా క‌రోనా సంక్షోభం ఎదుర్కొంటున్న స‌మ‌యంలో త‌న‌వంతు కృషి చేస్తున్నాడ‌ని కొనియాడింది. ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లోనూ బాధ్య‌తాయుతంగా విధులు నిర్వ‌ర్తించ‌డాన్ని నెటిజ‌న్లు కీర్తిస్తూ ఆకాశానికెత్తుతున్నారు.

క‌రోనా నుంచి జ‌నాల‌ను కాపాడేందుకు వీధుల్లో చెమ‌టోడ్చుతున్నాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో ఆఖ‌రి ఓవ‌ర్‌ వేసిన జోగింద‌ర్‌ అద్భుత‌మైన బౌలింగ్‌తో భార‌త్‌ను గెలిపించాడు. దీంతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన జోగింద‌ర్ 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. క్రికెట్‌లో అందించిన సేవ‌ల‌కుగానూ హ‌ర్యానా ప్ర‌భుత్వం అత‌న్ని డీఎస్పీ (డిప్యూటీ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్‌)గా నియ‌మించిన విష‌యం తెలిసిందే.

మరిన్ని వార్తలు