ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ

27 Jul, 2019 20:44 IST|Sakshi

దుబాయ్‌ : ప్రపంచకప్‌ ఫైనల్లో చోటుచేసుకున్న ఓవర్‌త్రో వివాదాస్పదంపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) స్పందించింది. ఈ విషయంలో అంపైర్‌ కుమార ధర్మసేనది ఏ మాత్రం తప్పులేదని వెనకేసుకొచ్చింది. ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ఉత్కంఠకర ఫైనల్‌ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓవర్‌త్రో ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఆఖరి ఓవర్లో మార్టిన్‌ గప్టిల్‌ విసిరిన బంతి బెన్‌స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లడం.. ఫీల్డ్‌ అంపైర్‌ ధర్మసేన 6 పరుగులివ్వడం తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం ఐదు పరుగులు ఇవ్వాలని ధర్మసేన అత్యుత్సాహంతో 6 పరుగులిచ్చి న్యూజిలాండ్‌ ఓటమికి కారణమయ్యాడని అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ధర్మసేన తన తప్పును అంగీకరించాడు. కానీ తన నిర్ణయం పట్ల పశ్చాతాపం మాత్రం వ్యక్తం చేయనన్నాడు.

ఇక తాజాగా ఈ వివాదంపై  ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ (క్రికెట్‌) జియోఫ్‌ అలార్డిస్‌ స్పందించాడు. ఈ విషయంలో ఫీల్డ్‌ అంపైర్ల తప్పేం లేదన్నాడు. ‘ ఆ రోజు ఫీల్డ్‌ అంపైర్లు సరైన విధానంలోనే నిర్ణయం ప్రకటించారు. ఫీల్డర్‌ త్రో వేసే సమయానికి బ్యాట్స్‌మన్‌ ఇద్దరు ఒకరినొకరు దాటారని భావించి, పద్దతి ప్రకారం చర్చించుకునే ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ సమయంలో బ్యాట్స్‌మెన్‌ ఒకరినొకరు దాటారా? లేరా? అనే నిబంధనపై వారికి అవగాహన ఉండటం గొప్ప విషయం. కానీ ఆ పరిస్థితులు థర్డ్‌ అంపైర్‌ను సమీక్ష కోరే అవకాశాన్ని ఇవ్వవు. ఇక ఫీల్డ్‌ అంపైర్లు తుది నిర్ణయం ప్రకటించాక, అది తప్పని మ్యాచ్‌ రిఫరీ జోక్యం చేసుకోలేడు’ అని చెప్పుకొచ్చారు.
 

>
మరిన్ని వార్తలు