క్రికెట్‌లో కొత్త నియమాలు.!

29 Sep, 2018 18:37 IST|Sakshi

బాల్‌ ట్యాంపరింగ్‌ తీవ్ర నేరంగా పరిగణించిన ఐసీసీ

డక్‌వర్త్‌ లూయిస్‌లో మార్పు

దుబాయ్‌: డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిని సవరించడంతో పాటు కోడ్ ఆఫ్ కండ‌క్ట్‌, ఐసీసీ ప్లేయింగ్ నిబంధనల్లోని మార్పులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ) శనివారం విడుదల చేసింది. వివాదాస్పదంగా మారిన డక్‌వర్త్‌ లూయిస్‌(డీఎల్‌ఎస్‌) పద్దతి నిబంధనలను సవరించింది. ఇక బాల్‌ టాంపరింగ్‌ సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మారిన ఈ నిబంధ‌న‌లు సెప్టెంబ‌ర్ 30 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని పేర్కొంది. కాగా జింబాబ్వేతో సౌతాఫ్రికా త‌ల‌ప‌డే తొలి వ‌న్డే కొత్త నిబంధ‌న‌ల‌తో ఆడే తొలి మ్యాచ్‌గా నిలువ‌నుంది.

ఐసీసీ 2014లో డీఎల్‌ఎస్‌ నూతన పద్దతిని ప్రవేశపెట్టింది. ఈ పద్దతి ప్రకారం బంతి, బంతికి వచ్చే పరుగులతో పవర్‌ ప్లేను పరిగణలోకి తీసుకొని విశ్లేషించి లిమిటెడ్‌ ఫార్మాట్‌లో విజేతను ప్రకటించేవారు. అయితే ప్రస్తుతం వన్డే, టీ20ల్లో బ్యాట్స్‌మెన్‌ చేసే పరుగుల సగటు మారిందని, ఈ నేపథ్యంతో ఈ పద్దతిని కొంత మార్చినట్లు ఐసీసీ పేర్కొంది. 

కొత్త నిబంధనల ప్రకారం బంతి ఆకారం మార్చడాన్ని (బాల్‌ ట్యాంపరింగ్‌) ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 3 నేరంగా పరిగణిస్తారు. ఏ ఆటగాడైనా బాల్ టాంపరింగ్‌కు పాల్పడితే అతనికి పెనాల్టీ కింద గతంలో 8 సస్పెన్షన్‌ పాయింట్లు విధించేవారు. దీనిని 12 సస్పెన్షన్‌ పాయింట్లకు పెంచుతూ ఐసీసీ నిబంధనలు మార్చింది. 12 సస్పెన్షన్‌ పాయింట్లంటే 6 టెస్టులు లేదా 12 వన్డేల నిషేదంతో సమానం.ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, బెన్‌క్రాఫ్ట్‌ల బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో ఐసీసీ ఈ నిబంధనల సవరణకు పూనుకుంది. బాల్ టాంపరింగ్‌ను తీవ్ర నేరంగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు వ్యక్తిగత దూషణకు దిగితే లెవల్‌ 1 నేరంగా పరిగణిస్తూ కొత్త నిబంధనను ప్రవేశ పెట్టారు.

మరిన్ని వార్తలు