కోహ్లి... మరో ఘనత

21 Feb, 2018 01:38 IST|Sakshi
బుమ్రా 

900 రేటింగ్‌ పాయింట్లను దాటేసిన భారత కెప్టెన్‌

నంబర్‌వన్‌ బౌలర్‌గా బుమ్రా 

దుబాయ్‌: భారత కెప్టెన్, బ్యాటింగ్‌ సంచలనం విరాట్‌ కోహ్లి మరో ఘనతకెక్కాడు. ఐసీసీ ర్యాంకుల్లో 900 రేటింగ్‌ పాయింట్లను దాటేశాడు. ఏకకాలంలో టెస్టు, వన్డే ఫార్మాట్‌లలో 900 రేటింగ్‌ పాయింట్లు సాధించి ఈ ఘనత పొందిన రెండో బ్యాట్స్‌మన్‌గా, తొలి భారత ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో భారత సారథి 909 రేటింగ్‌ పాయింట్లతో అగ్ర స్థానంలో... టెస్టు బ్యాట్స్‌మన్‌గా 912 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గతంలో డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా) మాత్రమే రెండు ఫార్మాట్‌లలో ఏకకాలంలో 900 రేటింగ్‌ పాయింట్లు సంపాదించాడు. మొత్తమ్మీద ఇప్పటివరకు వన్డేల్లో కేవలం ఐదుగురు క్రికెటర్లే అరుదైన ఈ ‘రేటింగ్‌’ క్లబ్‌లో ఉన్నారు.

బ్యాటింగ్‌ ఎవరెస్ట్‌ సచిన్‌ టెండూల్కర్‌ (887) కూడా అందుకోలేకపోయిన రేటింగ్స్‌ను కోహ్లి చేరుకోవడం విశేషం. మరోవైపు భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తొలిసారి నంబర్‌వన్‌ బౌలర్‌ అయ్యాడు. తాజా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అతను రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్తాన్‌; 787 పాయింట్లు)తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. పిన్న వయసులో (19 ఏళ్ల 153 రోజులు) నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ రికార్డు నెలకొల్పాడు.  

మరిన్ని వార్తలు