కోహ్లి సేన కొత్తకొత్తగా..

21 Aug, 2019 15:51 IST|Sakshi

అంటిగ్వా : వెస్టిండీస్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు కొత్తగా కనిపించనున్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో  ఐసీసీ కొత్త నిబంధనలకు అనుగుణంగా కోహ్లి సేనతో పాటు విండీస్‌ ఆటగాళ్లు నయా జెర్సీలతో మైదానంలోకి దిగనున్నారు. దీనిలో భాగంగా టీమిండియా ఆటగాళ్ల కొత్త జెర్సీలను బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది. 

సారథి విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేతో పాటు యువ సంచలనం రిషభ్‌ పంత్‌లు కొత్త జెర్సీలను ధరించి ఫోటో షూట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో టెస్టు సిరీస్‌కు ఎంపికైన 16 మంది సభ్యులు పాల్గొని సందడి చేశారు. ఆటగాళ్లకు సంబంధించిన ఫోటోలను టీమిండియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. 

సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు ఐసీసీ కొత్త హంగులు అద్దుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాదిరిగానే టెస్టుల్లోనూ ఆటగాళ్ల జెర్సీల వెనక వారి పేర్లు, నంబర్లు కనిపించనున్నాయి. యాషెస్‌ సిరీస్‌ నుంచే ఈ పద్దతి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక టెస్టుల్లో నంబర్‌ వన్‌ అయిన టీమిండియా విండీస్‌ సిరీస్‌తోనే ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌ వేటను ప్రారంభించనుంది. 

చదవండి:
కోహ్లి ఇంకొక్కటి కొడితే.. 
టెస్టుల్లో పోటీ రెట్టింపైంది

>
మరిన్ని వార్తలు