వార్మప్‌లో భారత్‌కు నిరాశ

20 Jun, 2017 00:42 IST|Sakshi
వార్మప్‌లో భారత్‌కు నిరాశ

డెర్బీ: ఐసీసీ మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌కు సన్నాహకంగా జరిగిన తొలి వార్మప్‌ మ్యాచ్‌లో భారత జట్టు తేలిపోయింది. డెర్బీ కౌంటీ గ్రౌండ్‌లో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 7 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టుపై గెలిచింది. టాస్‌ నెగ్గిన భారత్‌ మొదట బ్యాటింగ్‌కు దిగి 45.1 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌ (65 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), మోనా మేశ్రమ్‌ (57 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (21) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 26.3 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. రాచెల్‌ ప్రిస్ట్‌ (57 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1సిక్స్‌) అర్ధ సెంచరీతో రాణించింది. మిగతా వారిలో సుజి బేట్స్‌ (30), కటే మార్టిన్‌ (29 నాటౌట్‌), సోఫి డివైన్‌ (29 నాటౌట్‌) రాణించారు. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ 2 వికెట్లు, ఏక్తా బిస్త్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

మరిన్ని వార్తలు