టీమిండియా కాచుకో.. ఆసీస్‌ వచ్చేసింది

5 Mar, 2020 17:04 IST|Sakshi

సిడ్నీ: ఐసీసీ నిర్వహించే మెగాటోర్నీల్లో దక్షిణాఫ్రికాకు ఏ రీతిలోనూ అదృష్టం కలసి రాదని మరోసారి రుజువైంది. వర్షం పడి మ్యాచ్‌ రద్దయినా, మ్యాచ్‌ మధ్యలో వర్షం పడకున్నా దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వరుణుడు ఆస్ట్రేలియా వైపే నిలిచాడు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఐదు పరుగుల తేడాతో(డక్‌వర్త్‌ లూయిస్‌) ఆసీస్‌ విజయం సాధించింది. దీంతో ఆదివారం జరగబోయే ఫైనల్‌ పోరుకు అర్హత సాధించి టీమిండియాతో అమీతుమీకి సిద్దమైంది. 

అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్‌ కూడా వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఇదే మైదానంలో జరగాల్సిన తొలి సెమీస్‌ వర్షం కారణంగా రద్దయింది. అయితే రెండో సెమీస్‌ మ్యాచ్‌ ప్రారంభసమయానికి మైదానాన్ని సిబ్బంది సిద్దం చేశారు. ఇక టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సారథి మెగ్‌ లానింగ్‌ (49 నాటౌట్‌) మినహా మరే బ్యాటర్‌ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆసీస్‌ 134 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటింగ్‌ ముగిసిన వెంటనే వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం సఫారీ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98 పరుగులు నిర్దేశించారు. 

ఊహించని 98 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టుకు అదిరే ఆరంభం లభించేలేదు. టాపార్డర్‌ ఫూర్తిగా విఫలమైంది. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బౌలింగ్‌తో ఆసీస్‌ వరుసగా వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేసింది. అయితే చివర్లో లారా వోల్వార్డ్ట్(41 నాటౌట్‌) గెలిపించినంత పనిచేసింది. కానీ సహచర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో సఫారీ జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయింది. దీంతో మ్యాచ్‌ అనంతరం లారా కన్నీటి పర్యంతం అయింది. మరోవైపు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆసీస్‌ ఫైనల్‌కు చేరుకుంది. నాలుగు సార్లు టీ20 ప్రపంచకప్‌ చాంపియన్‌ అయిన ఆసీస్‌ ఐదో సారి కప్‌ సాధిస్తుందా? లేక భారత్‌ తొలి సారి కప్‌ను ముద్దాడుతుందా? అనేది ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌తో తేలనుంది. 

చదవండి:
ఫైనల్‌కు టీమిండియా తొలిసారి
ఇంగ్లండ్‌ను చూస్తే బాధేస్తోంది

మరిన్ని వార్తలు