మీటింగ్‌ తర్వాత గంగూలీ ఏమన్నాడంటే..

14 Mar, 2020 20:53 IST|Sakshi

ముంబై: ‘ప్రస్తుతం ఐపీఎల్‌ గురించి నేనేమీ చెప్పలేను. అప్పటికి ఉండే పరిస్థితుల్ని బట్టే ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఏప్రిల్‌ 15నాటికి పరిస్థితులు చక్కబడితే ఐపీఎల్‌ను కుదిస్తాం. ఇంతవరకే నేను చెప్పగలను. కాకపోతే ఎన్ని మ్యాచ్‌లు ఉంటాయి. ఎలా ఉంటాయి అనేది ఇప్పుడేమీ చెప్పలేను’ అని ఈరోజు జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ సమావేశం తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్యానించాడు. ముంబైలో జరిగిన సమావేశం తర్వాత మీడియా ముందు హాజరైన గంగూలీ తనకు ఎదురైన ఒక ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. (ఇక నీ వ్యాఖ్యానం అవసరం లేదు: సీఎస్‌కే)

ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29వ తేదీ నుంచి ఐపీఎల్‌ జరగాల్సి ఉండగా, కరోనా వైరస్‌ ప్రభావంతో దాన్ని ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ వాయిదా వేశారు. ఐపీఎల్‌ నిర్వహణపై ఈ రోజు గవర్నింగ్‌ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినా అప్పటి పరిస్థితుల్ని బట్టే నిర్ణయం తీసుకోవాలని గంగూలీ మాటల్ని బట్టి అర్ధమవుతుంది. ప్రస్తుతం క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నిర్వహణ అనేది కరోనా వైరస్‌ తీవ్రతపైనే ఆధారపడుతుందనే కాదనలేని సత్యం. వచ్చే నెల రెండో వారం నాటికి కరోనా ప్రభావం తగ్గితే ఐపీఎల్‌పై ముందుకు వెళతారు.. ఒకవేళ ఇదే అనిశ్చితి ఉంటే మాత్రం​ ఆ లీగ్‌ జరగకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కరోనా వైరస్‌ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉండటంతో ఐపీఎల్‌ను వేరే దేశాల్లోనే తటస్థ వేదికల్లో నిర్వహించే మార్గాలు కూడా లేవు. దీనికి కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడమే ఒక్కటే మార్గం.(ఐపీఎల్‌పై నో క్లారిటీ..! )

మరిన్ని వార్తలు