విండీస్‌తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేస్తే...

6 Oct, 2014 01:30 IST|Sakshi

భారత్‌కే టాప్ ర్యాంక్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్

 దుబాయ్: వెస్టిండీస్‌తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే... ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ పూర్తి స్థాయిలో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం 113 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికాతో కలిసి టీమిండియా సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే విండీస్‌తో సిరీస్‌ను 5-0తో గెలిస్తే భారత్ ఖాతాలో 116 రేటింగ్ పాయింట్లు వచ్చి చేరుతాయి. దీంతో టాప్ ర్యాంక్ భారత్ సొంతమవుతుంది. ఒకవేళ భారత్ 4-1తో సిరీస్ సాధించినా... యూఏఈలో పాక్‌తో జరిగే సిరీస్‌ను 3-0తో ఆస్ట్రేలియా స్వీప్ చేసినా... ఈ రెండు జట్లు 114 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను పంచుకోవాల్సి ఉంటుంది. అయితే దశాంశమానం తేడాలో ధోనిసేన నంబర్‌వన్‌లో ఉంటుంది.

 మరోవైపు విండీస్‌తో సిరీస్‌లో భారత యువ బ్యాట్స్‌మన్ కోహ్లి బ్యాట్ ఝుళిపిస్తే... మరోసారి నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో టాప్ ర్యాంక్‌లో ఉన్న ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్.... బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు దూరం కావడంతో మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. ప్రస్తుతం డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కెప్టెన్ ధోని 6వ, శిఖర్ ధావన్ 7వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా 5వ ర్యాంక్‌లో, ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో ఉన్నాడు.



 

మరిన్ని వార్తలు