అక్కడ ఇంకా ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోలు!

20 Feb, 2019 19:20 IST|Sakshi

కోల్‌కతా : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో యావత్‌ భారత్‌ దాయాది పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ఆ దేశంతో ఉన్న అన్ని సంబంధాలు తెంచేసుకుంటోంది. ఘటన జరిగిన మరుసటి రోజే మోస్ట్‌ ఫేవర్డ్‌ స్టేటస్‌ను ఉపసంహరించుకున్న భారత్‌.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని 200% పెంచింది. అంతేకాకుండా ఆదేశ సినీ నటులపై, క్రికెట్‌ ప్రసారాలపై నిషేధం విధించింది. మరోవైపు ఈ ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోలను అన్ని స్టేడియాలు తొలిగించాయి. ఒక్క ఇమ్రానే కాదు.. ఆదేశ క్రికెటర్లందరీ ఫొటోలను తీసేశాయి.

ఈ తరుణంలో పశ్చిమబెంగాల్‌లోని ఈడెన్‌ గార్డెన్‌లో మాత్రం ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటో ఇంకా అలానే ఉంది. అక్కడ ఇంకా ఇమ్రాన్‌ ఫొటో తీసేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై బీసీసీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల స్టేడియాల్లో ఫొటోలు తొలిగించిన బీసీసీఐ.. పశ్చిమ బెంగాల్‌లో ఎందుకు తొలిగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అంటే భయమా? అని నిలదీస్తున్నారు. ముంబై క్రికెట్‌ క్లబ్‌ తొలుత ఇమ్రాన్‌ ఫొటోలు తీసేయగా.. మిగతా క్రికెట్‌ సంఘాలు కూడా అనుసరించాయి. ఇక భారత్‌ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ఆడే అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుకుంటామని బీసీసీఐ పేర్కొనగా.. అభిమానులు మాత్రం రెండు పాయింట్లు పోయినా పర్వాలేదు.. కానీ పాక్‌తో ఆడవద్దని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు