ధావన్‌కు గాయం.. బ్యాటింగ్‌కు రాడా?

19 Jan, 2020 14:32 IST|Sakshi

బెంగళూరు: మూడు వన్డేల సిరీస్‌ను డిసైడ్‌ చేసే మ్యాచ్‌లో టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి బెంగళూరు వన్డే బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మళ్లీ గాయం బారిన పడ్డాడు. టీమిండియా బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రా వేసిన ఐదో ఓవర్‌ మూడో బంతిని ఫించ్‌ కవర్‌డ్రైవ్‌ ఆడి సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు.  అయితే అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న ధావన్‌ డైవ్‌ చేసి బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడి ఎడమ భుజానికి గాయమైంది. దీంతో ఫిజియో ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ నొప్పితో విలవిల్లాడిన ధావన్‌ మైదానాన్ని వీడాడు. ధావన్‌ స్థానంలో చహల్‌ ఫీల్డింగ్‌కు వచ్చాడు. 

దీంతో ధావన్‌ బ్యాటింగ్‌కు వస్తాడా రాడా అనేదానిపై అభిమానులు అందోళనకు గురవుతున్నారు. ఆసీస్‌ అంటే రెచ్చిపోయే ధావన్‌ కీలక వన్డేలో రాణింపుపైనే టీమిండియా విజయం ఆధారపడి ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ధావన్‌ గాయంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఇక ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ నుంచి ధావన్‌ను గాయాలు వీడటం లేదు. ప్రపంచకప్‌లో ఆసీస్‌ మ్యాచ్‌ సందర్భంగానే ధావన్‌ గాయపడి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డేల్లో ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో గాయడ్డాడు. ఇక మూడో వన్డే ఆరంభం వరకూ ధావన్‌ ఆడేది అనుమానంగా మారింది. కానీ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో అతడిని తుదిజట్టులోకి తీసుకున్నారు.   

>
మరిన్ని వార్తలు