స్మిత్‌ సెంచరీ.. మరో ఘనత

19 Jan, 2020 16:46 IST|Sakshi

బెంగళూరు: టీమిండియాతో జరుగుతున్న సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ శతకం సాధించాడు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 46 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో యువ క్రికెటర్‌ లబుషేన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు స్మిత్‌. ఆరంభంలో ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్‌ బోర్డు​ను పరుగులు పెట్టించారు. ఈక్రమంలో స్మిత్‌, లబుషేన్‌లు అర్దసెంచరీలు పూర్తిచేసుకున్నారు. 

అయితే మూడో వికెట్‌కు 127 పరుగులు జోడించి ప్రమాకరంగా మారుతున్న ఈ జోడిని రవీంద్ర జడేజా విడదీశాడు. లబుషేన్‌(54)ను ఔట్‌ చేశాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు స్మిత్‌ మాత్రం క్రీజులో పాతుకపోయాడు. నవదీప్‌ సైనీ వేసిన 39 ఓవర్‌ రెండో బంతిని ఫోర్‌ కొట్టి వన్డేల్లో 4000 పరుగులు పూర్తి చేశాడు. కేవలం 121 వన్డేల్లోనే స్మిత్‌ ఈ ఘనత అందుకోవడం విశేషం. ఇక అలెక్య్‌ క్యారీతో కలిసి జట్టుకు భారీ స్కోర్‌ అందించే ప్రయత్నం చేశాడు స్మిత్‌. ఈ క్రమంలో 117 బంతుల్లో 11 ఫోర్లు సహాయంతో స్మిత్‌ సెంచరీ సాధించాడు. ఇది స్మిత్‌కు వన్డేల్లో 9వ సెంచరీ కావడం విశేషం. అయితే స్మిత్‌ తన 8వ శతకం జనవరి 19, 2017 తేదీన చేయగా.. 9వ శతకం నేడు అదే తేదీన(జనవరి 19) చేయడం మరో విశేషం. 
 

మరిన్ని వార్తలు