వార్నర్‌ సరికొత్త రికార్డు

14 Jan, 2020 19:01 IST|Sakshi

ముంబై: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఆసీస్‌ తరఫున వన్డేల్లో వేగవంతంగా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. డేవిడ్‌ వార్నర్‌ తన 115వ వన్డే ఇన్నింగ్స్‌లో ఐదు వేల పరుగుల మార్కును చేరాడు. ఇది ఆసీస్‌ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో సాధించిన ఘనతగా నమోదైంది. ఇక ఈ ఓవరాల్‌ జాబితాలో కోహ్లి తర్వాత స్థానంలో వార్నర్‌ నిలిచాడు. కోహ్లి 114 ఇన్నింగ్స్‌లోనే ఐదు వేల వన్డే పరుగుల మార్కును చేరాడు. కాగా, దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా 101 ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల వన్డే పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి-వివ్‌ రిచర్డ్స్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా, వార్నర్‌ మూడో స్థానాన్నిఆక్రమించాడు. ఇంగ్లండ్‌ క్రికెటర్‌ జో రూట్‌ 116 ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల వన్డే పరుగులు సాధించి నాల్గో స్థానంలో ఉన్నాడు. భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్‌ ఈ ఫీట్‌ సాధించాడు.  వార్నర్‌  11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఐదు వేల వన్డే పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు.

ఫించ్‌-వార్నర్‌ల దూకుడు
టీమిండియాతో తొలి వన్డేలో ఫించ్‌-వార్నర్‌లు దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. భారత్‌ నిర్దేశించిన 256 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో వీరిద్దరూ వందకు పైగా పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే వార్నర్‌, ఫించ్‌లు హాఫ్‌ సెంచరలు నమోదు చేశారు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన ఓవర్‌లో కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ క్యాచ్‌ పట్టడంతో వార్నర్‌ ఇన్నింగ్స్‌ ముగిసిందనుకున్నారు. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంతో వార్నర్‌ దాన్ని సవాల్‌ చేసి రివ్యూకు వెళ్లాడు. ఇక్కడ వార్నర్‌ ఔట్‌ కాలేదని తేలడంతో ఆ తర్వాత రెచ్చిపోయి ఆడాడు. ముందు ఫించ్‌ దూకుడుగా ఆడితే, అటు తర్వాత వార్నర్‌ బౌండరీల మోత  మోగించాడు. దాంతో ఆసీస్‌ జట్టు 16 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ కోల్పోకుండా 116 పరుగులు చేసింది. 

మరిన్ని వార్తలు