కుల్దీప్‌ @ సెంచరీ

17 Jan, 2020 20:55 IST|Sakshi

రాజ్‌కోట్‌: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్‌ ఒక్కసారిగా తడబాటుకు గురైంది. భారత్‌ నిర్దేశించిన 341 పరుగుల టార్గెట్‌ను ధీటుగా బదులిస్తూ వచ్చిన ఆసీస్‌ను కుల్దీప్‌ యాదవ్‌ ఒక్కసారిగా దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్‌ 38 ఓవర్‌లో రెండు కీలక వికెట్లు సాధించి ఆసీస్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.  38 ఓవర్‌ రెండో బంతికి అలెక్స్‌ క్యారీ(18)ని ఔట్‌ చేసిన కుల్దీప్‌.. అదే ఓవర్‌ ఐదో బంతికి స్టీవ్‌ స్మిత్‌(98)ని బౌల్డ్‌ చేశాడు.  సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉండగా స్మిత్‌ బంతిని లోపలికి ఆడుకుని బౌల్డ్‌ అయ్యాడు. దాంతో ఆసీస్‌ 221 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది.భారత్‌ నిర్దేశించిన భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఆదిలోనే వార్నర్‌(15) వికెట్‌ను కోల్పోయింది. షమీ వేసిన నాల్గో ఓవర్‌ రెండో బంతికి వార్నర్‌ ఔటయ్యాడు. మనీష్‌ పాండే అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ప్రమాదకర వార్నర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తరుణంలో ఫించ్‌కు స్మిత్‌ జత కలిశాడు.

ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఫించ్‌(33) రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. జడేజా బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ స్టంప్‌ చేయడంతో ఫించ్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ సమయంలో స్మిత్‌-లబూషేన్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 96 పరుగులు జత చేసిన తర్వాత లబూషేన్‌(46) ఔట్‌ అయ్యాడు. జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి షమీ క్యాచ్‌ పట్టడంతో లబూషేన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆపై క్యారీ, స్మిత్‌లు ఒకే ఓవర్‌లో ఔట్‌ కావడంతో ఆసీస్‌ ఎదురీదుతోంది. ఆసీస్‌ కోల్పోయిన ఐదు వికెట్లలో జడేజా, కుల్దీప్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, షమీకి వికెట్‌ దక్కింది.

కుల్దీప్‌ ‘సెంచరీ’
కుల్దీప్‌ యాదవ్‌ వన్డేల్లో వంద వికెట్ల క్లబ్‌లో చేరిపోయాడు.  ఈ మ్యాచ్‌కు ముందు 99 వన్డే వికెట్లతో ఉన్న కుల్దీప్‌.. వికెట్‌ సాధించడం ద్వారా వందో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా వేగవంతంగా వంద వన్డే వికెట్లు సాధించిన మూడో భారత బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. 58వ మ్యాచ్‌లో కుల్దీప్‌ వందో వన్డే వికెట్‌ను సాధించాడు. అంతకుముందు భారత్‌ తరఫున షమీ(56), బుమ్రా(57)లు వేగవంతంగా వంద వన్డే వికెట్లు సాధించిన బౌలర్లు.

మరిన్ని వార్తలు