గెలుస్తారా? సిరీస్‌ సమర్పిస్తారా?

7 Nov, 2019 18:47 IST|Sakshi

రాజ్‌కోట్‌ : వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు తొలి టీ20లో బంగ్లాదేశ్‌  భారీ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో గురువారం స్థానిక మైదానంలో జరిగే రెండో టీ20పై అందరిలోనూ అసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తుపాను కారణంగా వర్షం పడే అవకాశం ఉండటంతో తొలుత బౌలింగ్‌ చేస్తేనే బెటర్‌ అని భావించిన సారథి రోహిత్‌ శర్మ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు అహ్వానించాడు. ఇక ఈ మ్యాచ్‌ కోసం ఇరుజట్లలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.

తొలి టీ20లో ఘోర పరాభావంతో టీమిండియా తుది జట్టులో మార్పులు ఉంటాయని భావించారు. అయితే సారథి రోహిత్‌ ఎలాంటి మార్పులకు అవకాశం ఇవ్వలేదు. రిషభ్‌ పంత్‌ వైపే రోహిత్‌ మొగ్గు చూపడంతో.. సంజూ శాంసన్‌ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక శివం దూబేపై మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచింది. ఇక బంగ్లా కూడా విన్నింగ్‌ టీమ్‌ను మార్చకూడదనే ఉద్దేశంతో తొలి టీ20 జట్టునే ఈ మ్యాచ్‌కు కొనసాగించింది. రాజ్‌కోట్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక​ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని బంగ్లా ఆరాటపడుతుండగా.. ఎలాగైనా గెలిచి సిరీస్‌తో పాటు పరువు కాపాడుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది.

తుదిజట్లు: 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, రాహుల్‌, శ్రేయస్, రిషభ్‌ పంత్, శివమ్‌ దూబే, కృనాల్‌ పాండ్యా, సుందర్, చహల్, దీపక్‌ చహర్, ఖలీల్‌ అహ్మద్‌.

బంగ్లాదేశ్‌: మహ్ముదుల్లా (కెప్టెన్‌), లిటన్‌ దాస్, సౌమ్య సర్కార్, నయీమ్‌, ముష్ఫికర్‌ రహీమ్, మొసద్దిక్‌ హుస్సేన్, అఫిఫ్‌ హుస్సేన్, ఇస్లామ్, ముస్తఫిజుర్, అల్‌ అమిన్‌, షఫీయుల్‌.

మరిన్ని వార్తలు