ఇషాంత్‌ మళ్లీ విజృంభణ..బంగ్లా విలవిల

23 Nov, 2019 18:19 IST|Sakshi

కోల్‌కతా: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ విలవిల్లాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అదే పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. శనివారం రెండో రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా తొమ్మిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.బంగ్లాదేశ్‌ ఇలా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కాసేపటికే రెండు వికెట్లను కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ నిప్పులు చెరిగే బంతులతో తొలి రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.  ఓపెనర్‌ షాద్‌మన్‌ ఇస్లామ్‌, మోమినుల్‌ హక్‌లను డకౌట్లగా పెవిలియన్‌కు పంపాడు.

ఇషాంత్‌ వేసే బంతుల్ని ఎదుర్కోవడానికి బెంబేలెత్తిన వీరిద్దరూ చివరకు వికెట్లు సమర్పించుకున్నారు. ఆ తర్వాత మహ్మద్‌ మిథున్‌(6)ను ఉమేశ్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. ఆపై స్వల్ప వ్యవధిలో ఇమ్రుల్‌ కేయిస్‌(5)ను ఇషాంత్‌ ఔట్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్‌ వేసిన ఏడో ఓవర్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చిన ఇమ్రుల్‌ పెవిలియన్‌ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్‌ ఐదు వికెట్లతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 347/9  వద్ద డిక్లేర్డ్‌ చేసింది. దాంతో భారత్‌కు 241 పరుగుల ఆధిక్యం లభించింది.

మరిన్ని వార్తలు