ఎంఎస్‌ ధోని రికార్డు బ్రేక్‌

24 Nov, 2019 17:43 IST|Sakshi

కోల్‌కతా: దాదాపు ఆరేళ్లుగా ఎంఎస్‌ ధోని పేరిట ఉన్న రికార్డు బద్ధలైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ధోని రికార్డు తెరమరుగైంది. బంగ్లాపై రెండో టెస్టులో విజయంతో కోహ్లి వరుసగా ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా వరుసగా అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే ఎంఎస్‌ ధోని కెప్టెన్‌గా వరుసగా సాధించిన ఆరు టెస్టు విజయాల రికార్డు సవరించబడింది.

2013లో ధోని నేతృత్వంలోని భారత జట్టు టెస్టు ఫార్మాట్‌లో వరుసగా ఆరు విజయాలు సాధించగా, దాన్ని కోహ్లి బ్రేక్‌ చేశాడు. వెస్టిండీస్‌ పర్యటనలో వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన కోహ్లి సేన.. ఆపై దక్షిణాఫ్రికాపై స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను సైతం వైట్‌వాష్‌ చేసింది. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్‌ చేసింది. దాంతో వరుసగా ఏడో విజయాన్ని కోహ్లి సారథ్యంలోని భారత్‌ జట్టు అందుకుంది.

ఇక వరుసగా నాలుగు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ విజయాల్ని సాధించడం ద్వారా టీమిండియా నయా రికార్డును నెలకొల్పింది. టెస్టు చరిత్రలో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లో సాధించడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికా చివరి రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్‌ విజయాలు సాధించగా, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టులను కూడా ఇన్నింగ్స్‌ తేడాతోనే భారత్‌ గెలుచుకుంది.

మరిన్ని వార్తలు