రికీ పాంటింగ్‌ రికార్డు బ్రేక్‌

23 Nov, 2019 16:08 IST|Sakshi

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డులు మీద రికార్డులు కొల్లకొడుతున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఐదు వేల పరుగుల్ని వేగవంతంగా పూర్తి చేసిన రికార్డే కాకుండా, పింక్‌ బాల్‌ టెస్టులో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన కోహ్లి.. మరో ఘనతను నమోదు చేశాడు. టెస్టుల్లో ఒక కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. బంగ్లాతో టెస్టులో చేసిన సెంచరీ కోహ్లికి ఈ ఫార్మాట్‌లో 27వది కాగా, కెప్టెన్‌గా 20వ టెస్టు శతకం. దాంతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌(25) తర్వాత స్థానంలో కోహ్లి నిలిచాడు. ఈ క్రమంలోనే పాంటింగ్‌ను కోహ్లి అధిగమించాడు. మరొకవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో పాంటింగ్‌ సరసన నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి కెప్టెన్‌గా కోహ్లికి ఇది 41వ సెంచరీ. పాంటింగ్‌ కూడా 41 శతకాలు ఉన్నాడు. ఇప్పుడు పాంటింగ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు కోహ్లి.

ఇక టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను కోహ్లి దాటేశాడు. ఒక ఆటగాడిగా కోహ్లి టెస్టుల్లో 27 సెంచరీలు సాధించగా, గ్రేమ్‌ స్మిత్‌, అలెన్‌ బోర్డర్‌లు కూడా అన్నే సెంచరీలతో ఉన్నారు. దాంతో వారితో కలిసి టెస్టు ఆటగాళ్ల జాబితాలో 17వ స్థానంలో ఉన్నాడు. మరొకవైపు అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన జాబితాలో కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లి 70 అంతర్జాతీయ సెంచరీలతో టాప్‌-3లో నిలిచాడు. ముందు వరసులో సచిన్‌ టెండూల్కర్‌(100 సెంచరీలు), పాంటింగ్‌( 71 సెంచరీలు)లు ఉన్నారు. బంగ్లాదేశ్‌తో టెస్టులో కోహ్లి 136 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆరో వికెట్‌గా ఔటయ్యాడు. అంతకుముందు రవీంద్ర జడేజా(12) పెవిలియన్‌ చేరాడు.భారత జట్టు 82 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. దాంతో భారత్‌కు 203 పరుగుల ఆధిక్యం లభించింది. బంగ్లాదేశ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు