భారత్‌తో టెస్టు: బంగ్లాదేశ్‌ 140/8

14 Nov, 2019 14:34 IST|Sakshi

ఇండోర్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ ఎదురీదుతోంది. గురువారం తొలి రోజు ఆటలో భాగంగా 140 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు తమ విజృంభణ కొనసాగిస్తుండటంతో బంగ్లాదేశ్‌ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆటలో లంచ్‌ సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌.. ఆపై టీ బ్రేక్‌కు  వెళ్లే సమయానికి మరో నాలుగు వికెట్లను చేజార్చుకుంది.  ప్రధానంగా అశ్విన్‌, మహ్మద్‌ షమీలు చెలరేగడంతో బంగ్లాదేశ్‌ 41 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు చేజార్చుకుంది. అశ్విన్‌ తన మ్యాజిక్‌తో బంగ్లాను ముప్పుతిప్పలు పెట్టగా, షమీ కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను ఎదుర్కొవడానికి అపసోపాలు పడుతుంది. షమీ తీసిన మూడు వికెట్లలో ఒక బౌల్డ్‌ కగా, రెండు ఎల్బీల రూపంలో వచ్చాయి.

 టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌ కేస్‌లు ప్రారంభించగా వారిద్దరూ తలో ఆరు పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. ఇషాంత్‌ వేసిన  ఆరో ఓవర్‌ చివరి బంతికి షాద్‌మన్‌ ఔట్‌ కాగా, ఆపై ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఏడో ఓవర్‌ ఆఖరి బంతికి ఇమ్రుల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. షాదమ్‌న్‌ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పట్టగా, ఇమ్రుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను రహానే అందుకున్నాడు. దాంతో 12 పరుగులకే బంగ్లాదేశ్‌ రెండు వికెట్లను చేజార్చుకుంది. మూడో వికెట్‌గా కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌(37)ను అశ్విన్‌ ఔట్‌ చేయడంతో బంగ్లా నిలకడైన భాగస్వామ్యానికి తెరపడింది.

ఇక ముష్పికర్‌ రహీమ్‌(43) ఒక్కడే బాధ్యతాయుతంగా ఆడాడు. రహీమ్‌ను బౌల్డ్‌ చేసిన షమీ.. ఆపై మరుసటి బంతికి మెహిదీ హసన్‌ను గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ చేశాడు. టీ బ్రేక్‌ తర్వాత ఇషాంత్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతికే లిటాన్‌ దాస్‌(21) ఔట్‌ అయ్యాడు. 140 పరుగుల వద్దే బంగ్లా మూడు వికెట్లను కోల్పోయింది. బంగ్లా కోల్పోయిన ఎనిమిది వికెట్లలో షమీ మూడు వికెట్లు సాధించగా, అశ్విన్‌, ఇషాంత్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఉమేశ్‌కు వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు