మరో ఇన్నింగ్స్‌ విజయం సాధిస్తారా?

23 Nov, 2019 17:09 IST|Sakshi

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 347/9 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. 174/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం రెండో రోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా మరో 173 పరుగులు జోడించి మరో ఆరు వికెట్లను కోల్పోయింది. సాహా, షమీలు క్రీజ్‌లో ఉన్న సమయంలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేస్తున్నట్లు కోహ్లి ప్రకటించాడు. ఆటగాళ్లను వచ్చేయమంటూ చేతితో సంకేతాలిచ్చాడు. ఈ రోజు ఆటలో కోహ్లి(136; 194 బంతుల్లో 18 ఫోర్లు), అజింక్యా రహానే(51; 69 బంతుల్లో 7 ఫోర్లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో భారత్‌ మోస్తరు స్కోరునే సాధించింది. నిన్నటి ఆటలో చతేశ్వర్‌ పుజారా(55; 105 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు రహానే-కోహ్లిలు ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించారు. కాగా, రహానే హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయితే జడేజా(12) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. జట్టు స్కోరు 289 పరుగుల వద్ద ఉండగా జడేజా ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేటికి కోహ్లి కూడా ఔట్‌ కావడంతో భారత జట్టు వరుసగా చివరి వరుస వికెట్లను కోల్పోయింది. ఇక చివర్లో సాహా(17 నాటౌట్‌, షమీ(10 నాటౌట్‌లు ఫర్వాలేదనిపించడంతో భారత్‌ జట్టు 340 పరుగుల మార్కును దాటింది. బంగ్లా బౌలర్లలో ఎబాదత్‌ హుస్సేన్‌, అల్‌ అమీన్‌ హుస్సేన్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, అబు జాయేద్‌కు రెండు వికెట్లు లభించాయి. తైజుల్‌ ఇస్లామ్‌ వికెట్‌ తీశాడు.

అంతకుముందు బంగ్లాదేశ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 241 పరుగుల ఆధిక్యం లభించింది.  తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. మరో ఇన్నింగ్స్‌ విజయంపై కన్నేసింది. భారత్‌ సాధించిన తొలి ఇన్నింగ్స్‌ పరుగులు చేయకుండా బంగ్లాను రెండో ఇన్నింగ్స్‌లో కట్టడి చేస్తే ఇన్నింగ్స్‌ గెలుపును అందుకుంటుంది.

మరిన్ని వార్తలు