ఇది మాకు శుభసూచకం: రాహుల్‌

25 Jan, 2020 10:18 IST|Sakshi

ఆక్లాండ్‌: సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనను టీమిండియా ఘనవిజయంతో ఆరంభించింది. ఆక్లాండ్‌ వేదికగా జరిగిని తొలి టీ20లో కోహ్లి సేన సమిష్టిగా ఆడి ఆరు వికెట్లు తేడాతో విజయ ఢంకా మోగించింది. ఇక ఈ విజయంలో ముఖ్యపాత్ర పోషించిన ‘మ్యాన్‌ ఆఫ్‌ మ్యాచ్‌’ శ్రేయస్‌ అయ్యర్‌పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తాజాగా మ్యాచ్‌ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అయ్యర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘ఇది చాలా మంచి పరిణామం. జట్టు కష్ట కాలంలో ఉన్నప్పుడు, అధిక ఒత్తిడిలో కూడా గెలిపించే బ్యాట్స్‌మన్‌ కోసం ఇంత కాలం వేచిచూశాం. రెండు వందలకు పైగా లక్ష్యాన్ని ఛేదించాలంటే  ప్రతీ ఓవర్‌లో బౌండరీ కొట్టడం ముఖ్యం. లేకుంటే బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఈ రోజు మ్యాచ్‌లో ఆ పనిని సులువుగా నిర్వర్తించాం. అయ్యర్‌, దుబె, మనీశ్‌ పాండేలు వచ్చీ రాగానే బౌండరీలు బాదడం అభినందనీయం. ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌ ఆట నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా అర్థసెంచరీ పూర్తయ్యాక ప్రశాంతంగా సెలబ్రేషన్స్‌ చేసుకోవడం అభినందనీయం. ఐపీఎల్‌లో ఓ జట్టు సారథిగా అతడు పరిస్థితులను అర్థం చేసుకొని మ్యాచ్‌లను ముగిస్తున్నాడు.

ఈ ఒక్క మ్యాచే కాదు ఇంతకుముందు జరిగిన వన్డే, టీ20ల్లో కూడా అయ్యర్‌ ఫినిషర్‌ పాత్రను సక్రమంగా నిర్వర్తించాడు. ఇది టీమిండియాకు ఎంతో శుభసూచకం. ఇక ప్రస్తుతం కీపింగ్‌ బాధ్యతలను ఎంజాయ్‌ చేస్తున్నా. వికెట్ల వెనకాల ఉండటంతో మ్యాచ్‌, పిచ్‌పై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. తర్వాత బ్యాట్స్‌మన్‌గా నేను ఎలాంటి షాట్స్‌ ఆడాలో నాకు ఓ ఐడియా ఏర్పడుతుంది. నాకు ఇబ్బంది కలగనంతవరకు కీపింగ్ చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తాను. ఇక టెస్టు జట్టులో స్థానం పోయాక నా ఆటలో కొన్ని మార్పులు చేసుకున్నాను. సానుకూల దృక్ఫథంతో ఆడాలని నిశ్చయించుకున్నాను. అంతేకాకుండా ఏ సమయంలో కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, పరిస్థితులకు తగ్గట్టు ఆడటం ముఖ్యమని తెలసుకున్నాను’అని కేఎల్‌ రాహుల్‌ పేర్కొన్నాడు.

చదవండి: 
రాహులా.. ఇదే కదా అదృష్టం!

మరో సూపర్‌స్టార్‌ వచ్చాడు..

​​​​​​​
 

మరిన్ని వార్తలు