జహీర్‌ ఖాన్‌ సరసన ఇషాంత్‌

23 Feb, 2020 08:50 IST|Sakshi

వెల్లింగ్టన్‌: ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సీనియర్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ ఐదు వికెట్లతో మెరిశాడు. మిగతా పేస్‌ బౌలర్లు రాణించని చోట ఇషాంత్‌ రాణించడంతో కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కట్టడి చేయగలిగింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, టామ్‌ బ్లన్‌డెల్‌, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌లతో పాటు టెయిలెండర్లు టిమ్‌ సౌతీ, ట్రెంట్‌ బౌల్ట్‌ల వికెట్లను ఇషాంత్‌ పడగొట్టి ఈ ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇషాంత్‌కు ఇది 11వ సారి. 

ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక ఐదు వికెట్లు తీసిన రెండో భారత పేసర్‌గా జహీర్‌ సరసన ఇషాంత్‌ చేరాడు. జహీర్‌ 92 టెస్టుల్లో 11 సార్లు ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్‌ 97 టెస్టుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో కపిల్‌ దేవ్‌(23) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక విదేశీ గడ్డపై ఎక్కువ సార్లు ఐదు వికెట్లు(9) పడగొట్టిన మూడో టీమిండియా బౌలర్‌గా లంబూ నిలిచాడు. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో కపిల్‌ దేవ్‌(12), అనిల్‌ కుంబ్లే(10)లు ఉన్నారు. ఇక కివీస్‌తో టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు కూడా ఆడటం సందేహంగానే ఉన్నా...చివరకు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇషాంత్‌ జట్టుతో చేరిన విషయం తెలిసిందే. 

చదవండి:
ఇషాంత్‌ జోరు... 
ఆధిక్యం 51 నుంచి 183కు..

మరిన్ని వార్తలు