అది కామెడీగా ఉంది: ఇషాంత్‌

23 Feb, 2020 09:49 IST|Sakshi

వెల్లిం​గ్టన్‌: విమర్శకులకు ఓపిక ఉండదంటారు. ఎందుకంటే ఎవరైన ఒక చిన్న పొరపాటు చేసినా అతడికి సంబంధించిన గత ఘనతలను, రికార్డులను పట్టించుకోకుండా ఏకిపారేస్తుంటారు. పరిస్థితులు, ప్రదర్శనను పట్టించుకోకుండా కేవలం ఫలితం ఆదారంగానే విమర్శలు గుప్పిస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా కూడా విమర్శకులకు ప్రధాన టార్గెట్‌గా నిలిచాడు. గాయం కారణంగా నాలుగు నెలలకు పైగా ఆటకు దూరమైన బుమ్రా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

అనంతరం టీమిండియా పేస్‌ దళపతిగా బుమ్రా న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టాడు. అయితే ఇప్పటివరకు జరిగిన రెండు ఫార్మట్లలో అంతగా ఆకట్టుకోని బుమ్రా.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయాడు. వికెట్లను తీయకపోగా పరుగులు కట్టడిచేయడంలో విఫలమవుతున్నాడు. దీంతో బుమ్రాపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బుమ్రాకు అండగా సీనియర్‌ బౌలర్‌ ఇషాంత్‌శర్మ నిలిచాడు. 

‘రెండేళ్లుగా టెస్టుల్లో నేను, బుమ్రా, షమీ, అశ్విన్‌, జడేజా కలిసి 20 వికెట్లు పడగొడుతున్నాం. కేవలం ఒక మ్యాచ్‌ లేక ఒక ఇన్నింగ్స్‌తో ఓ ఆటగాడి సాఘార్థ్యాన్ని ప్రశ్నిస్తారు. బుమ్రా ప్రతిభ గురించి ఎవరూ ప్రశ్నించరని అనుకుంటున్నా. అరంగేట్ర మ్యాచ్‌ నుంచి అతడి సాధించిన రికార్డులు, ఘనతలు మనందరికీ తెలుసు. కష్టకాలంలో అండగా నిలవాలి. ఇలా ఒక ఇన్నింగ్స్‌కే గత అభిప్రాయాలను మార్చుకొని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది’అని ఇషాంత్‌ పేర్కొన్నాడు. 

ఇక కివీస్‌ సీనియర్‌ బౌలర్‌ టిమ్‌ సౌతీ కూడా బుమ్రాకు మద్దతుగా నిలిచాడు. అత్యుత్తమంగా రాణించేందుకు అతడు కఠోర సాధన చేస్తున్నాడన్నాడు. కొన్ని సార్లు పరిస్థితులు అనకూలించక బాగా బౌలింగ్‌ చేసిన వికెట్లు దొరకవని సౌతీ పేర్కొన్నాడు.  ఇక తొలి ఇన్నింగ్స్‌లో వాట్లింగ్‌ వికెట్‌ ఒక్కటి మాత్రమే బుమ్రా దక్కించుకున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో బుమ్రా ఒక్క వికెట్‌కు దక్కించుకోని విషయం తెలిసిందే.

చదవండి:
జహీర్‌ ఖాన్‌ సరసన ఇషాంత్‌
ఆధిక్యం 51 నుంచి 183కు..

మరిన్ని వార్తలు