ఓటమిపై విలియమ్సన్‌ ఏమన్నాడంటే?

26 Jan, 2020 16:34 IST|Sakshi

ఆక్లాండ్‌: అచ్చొచ్చిన ఆక్లాండ్‌ మైదానంలో టీమిండియా మరోసారి అదరగొట్టింది. దీంతో వరుసగా రెండో టీ20లోనూ కోహ్లి సేన ఘన విజయం సాధించింది. ఆదివారం స్థానిక మైదానంలో కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లూను హాప్‌ సెంచరీ సాధించి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఇక మ్యాచ్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ భారత బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. 

‘ఇదే వేదికపై జరిగిన తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈ రోజు పిచ్‌ విభిన్నంగా ఉంది. మేము మరో 15-20 పరుగులు చేసుంటే బాగుండేది. కానీ నాతో పాటు అందరం విఫలమయ్యాం. అయితే 132 పరుగులే చేసినప్పటికీ మా బౌలర్లు మాకు మంచి శుభారంభాన్నే అందించారు. ఆరంభంలోనే రెండు ప్రధాన వికెట్లు పడగొట్టారు. అయితే అదే ఒత్తిడిని టీమిండియాపై కొనసాగించలేకపోయాం. ముఖ్యంగా మా స్పిన్నర్లు టీమిండియాపై ప్రభావం చూపలేకపోయారు. అయితే మా స్పిన్న​ర్లను నిదించడం లేదు. 

ఎందుకంటే స్పిన్‌ బౌలింగ్‌లో ఆడటం భారత బ్యాట్స్‌మెన్‌కు ఎంతో అనుభవం ఉంది.  బ్యాటింగ్‌లో మరో 15-20 పరుగులు చేసినా, బౌలర్లు మధ్యలో మరో రెండు వికెట్లు పడగొట్టిన ఫలితం మారేది కావచ్చు. అయితే మా తప్పులను చర్చించుకుంటాం. తర్వాతి మ్యాచ్‌లో మెరుగ్గా ఆడేందుకు కృషి చేస్తాం. ఇక ఈ రోజు మ్యాచ్‌ క్రెడిట్‌ మొత్తం భారత బౌలర్లకే దక్కుతుంది. వారు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఈ విజయానికి అన్నిరకాల అర్హమైనదే’అని విలియమ్సన్‌ పేర్కొన్నాడు.

చదవండి:
‘రెండో’ది కూడా మనదే..

పుజారాకు సచిన్‌ వెరైటీ విషెస్‌

మరిన్ని వార్తలు