పోరాటం లేదు.. దాసోహమే

1 Mar, 2020 11:53 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: భారత బ్యాట్స్‌మెన్‌ మరోసారి న్యూజిలాండ్‌ బౌలర్లకు దాసోహమయ్యారు. కనీసం పోరాటపటిమను కూడా ప్రదర్శించుకుండా నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకున్నారు. దీంతో రెండో టెస్టు కూడా టీమిండియా చేతుల్లోంచి దాదాపు చేజారి వైట్‌వాష్‌కు ద​గ్గరైంది. ఏడు పరుగుల స్వల్ప ఆధి​క్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని 97 పరుగుల లీడ్‌లో టీమిండియా ఉంది. ప్రస్తుతం హనుమ విహారీ (5 బ్యాటింగ్‌), పంత్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. బౌలింగ్‌లో కివీస్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (3/12) మరోసారి తన పేస్‌ రుచిచూపించగా.. గ్రాండ్‌హోమ్‌, వాగ్నర్‌,సౌతీలు తలో వికెట్‌ పడగొట్టారు. 

బ్యాట్స్‌మన్‌ తీరుమారలేదు..
కివీస్‌ టెయిలెండర్లు సైతం సులువుగా పరుగులు రాబట్టిన చోట భారత బ్యాట్స్‌మన్‌ ఘోరంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం లభించిందన్న సంబరం కొన్ని నిమిషాలకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా దారుణంగా విఫలమైంది. స్కోర్‌ బోర్టులో పరుగుల కంటే వేగంగా వికెట్లు పడ్డాయి. పిచ్‌ ప్రభావం.. కివీస్‌ బౌలర్ల ప్రతిభ అనడంకంటే భారత బ్యాట్స్‌మెన్‌ నిర్లక్ష్యం, తొందరపాటు అని చెప్పాలి. తొలుత మయాంక్‌ అగర్వాల్‌(3)ను బౌల్ట్‌ బోల్తాకొట్టించగా.. సౌథీ బౌలింగ్‌లో పృథ్వీషా(14) తొందరపడ్డాడు. అనంతరం గ్రాండ్‌హోమ్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి (14) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో ఔటైన విధంగానే రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఔటవ్వడం గమనార్హం. 

ఇక రహానే (9)ను పక్కా వ్యూహంతో వాగ్నర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ప్రత్యర్థి వ్యూహాలకు అనుభవజ్ఞుడైన రహానే తలవంచడం విడ్డూరంగా ఉంది. ఇక ఆదుకుంటాడని భావించిన పుజారా (24) కూడా బౌల్టౌ జిమ్మిక్కులను అర్థం చేసుకోలేక బౌల్డ్‌ అయ్యాడు. నైట్‌వాచ్‌మన్‌ ఉమేశ్‌ యాదవ్‌ (1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. దీంతో 89 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా రెండో టెస్టులో ఓటమి అంచున నిల్చుంది. ఇక ప్రస్తుతం క్రీజులో ఉన్న విహారీ, పంత్‌ల పోరాటంపైనే టీమిండియా గెలుపోటమి ఆధారపడి ఉంది. అయితే ప్రస్తుత సమయంలో గెలుపుపై ఆశ లేదు కానీ కనీసం పోరాడే స్కోర్‌ సాధిస్తే కాస్త పరువైనా మిగులుతుంది. 

తోకను కత్తిరించలేకపోయారు.. 
కివీస్‌ టెయిలెండర్లు మరోసారి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 63/0తో రెండో రోజు ఆట ప్రాంభించిన కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. టామ్‌ లాథమ్‌(52) అర్థసెంచరీతో రాణించాడు. లాథమ్‌ మినహా మరే బ్యాట్స్‌మన్‌ చెప్పుకోదగ్గ స్కోర్‌ సాధించకపోవడంతో ఓ క్రమంలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అయితే కీలక సమయంలో  జేమీసన్‌(49) దాటిగా ఆడి టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నాడు. జేమీసన్‌కు తోడు వాగ్నర్‌(21) భారత బౌలర్లను ప్రతిఘటించాడు. వీరిద్దరు 9 వికెట్‌కు 51 పరుగులు జోడించి కివీస్‌ను ఆధిక్యంవైపు నడిపించారు. అయితే షమీ బౌలింగ్‌లో జడేజా సూపర్బ్‌ క్యాచ్‌ అందుకోవడంతో వాగ్నర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ వెంటనే జేమీసన్‌ను కూడా షమీ పెవిలియన్‌కు పంపించడంతో కివీస్‌ 235 పరుగులకు ఆలౌటైంది.  మహ్మద్‌ షమీ (4/81), బుమ్రా (3/62), జడేజా (2/22), ఉమేశ్‌ (1/46)లు రాణించారు. 

చదవండి:
అదే బంతి.. బౌలర్‌ మారాడంతే!
సలాం జడ్డూ భాయ్‌..
పర్ఫెక్ట్‌ ప్లానింగ్.. ఎగ్జిక్యూషన్ అంటే ఇదే!

మరిన్ని వార్తలు