‘సూపర్‌’ విజయంపై కోహ్లి, రోహిత్‌ల స్పందన!

29 Jan, 2020 17:42 IST|Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠపోరులో టీమిండియా తన అనుభవాన్ని ఉపయోగించి ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌పై ఎలాంటి ఆశలు లేని సయమంలో మహ్మద్‌ షమీ తన మ్యాజిక్‌ బౌలింగ్‌తో మ్యాచ్‌ను టై చేశాడు. అనంతరం సూపర్‌ ఓవర్‌లో రోహిత్‌ తన హిట్‌ బ్యాటింగ్‌తో రెచ్చిపోగా.. రాహుల్‌ తనవంతు సహకారాన్ని అందించాడు. దీంతో టీమిండియా సగర్వంగా మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో బహుమతి ప్రధానోత్సవంలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, ‘ప్లేయర్‌ ఆప్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మలు విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. 

కోచ్‌కు ముందే చెప్పా: కోహ్లి
‘మ్యాచ్‌ పూర్తయ్యాక మనం గెలిచేందుకు అన్ని విధాల అర్హులమని కోచ్‌కు చెప్పాను. అంతేకాకుండా సూపర్‌ చివరి బంతికి కోచ్‌తో స్టంప్స్‌ కొట్టేది (విజయం మనదే) మనమే అని చెప్పా. రోహిత్‌ శర్మ రూపంలో టీమిండియాలో ఓ అద్భుతమైన ఆటగాడు ఉన్నాడు. మేము ఓ దశలో మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం.  అయితే షమీ చివరి ఓవర్‌ అదేవిధంగా లాస్ట్‌ బంతి ఇంకా నా ముందు తిరుగుతోంది. షమీ చివరి రెండు బంతి డాట్‌ బాల్స్‌ చేశాక సూపర్‌ ఓవర్‌ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఇక సూపర్‌ ఓవర్‌లో ప్రపంచంలోనే డెత్‌ ఓవర్‌ స్పెషలిస్టుగా పేరుగాంచిన బుమ్రా బౌలింగ్‌లో విలియమ్సన్‌ బౌండరీలు రాబట్టాడు. విలియమ్సన్‌ బ్యాటింగ్‌ సూపర్బ్‌. ఇక ఈ విజయంతో రిజర్వ్‌ బెంచ్‌పై కూర్చొన్న నవదీపై సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌లకు తర్వాతి మ్యాచ్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది’ అని సారథి విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. 

ఇదే తొలిసారి: రోహిత్‌ శర్మ
సూపర్‌ ఓవర్‌లో ఇంతవరకెప్పుడు బ్యాటింగ్‌ చేయలేదు. అసలేం ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ముఖ్యంగా తొలి బంతి సింగిల్‌ తీసే ప్రయతంలో, మూడు, నాలుగు బంతుల తర్వాత ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. అయితే చివరి రెండు బంతుల వరకు నేను ఒక్కటే అనుకున్నా బౌలర్‌ తప్పిదం చేసేవరకు వేచిచూడాలని. చివరి రెండుబంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు విజయాన్ని అందించడం ఆనందంగా ఉంది. ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లో అంతగా పరుగులు చేయలేదు. దీంతో ఈరోజు బాగా ఆడాలనుకుని సాధారణంగానే క్రీజులోకి వచ్చాను. పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు చక్కగా సహకరించింది. అయితే ఈ మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ కూడా సొంతమవుతుంది. అదే విధంగా రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లకు తర్వాతి మ్యాచ్‌ ఆడే అవకాశం వస్తుందని భావించాం’అని రోహిత్‌ శర్మ అన్నాడు. 

చదవండి:
టీమిండియా ‘సూపర్‌’ విజయం

ధోనిని దాటేసిన ‘కెప్టెన్‌’.. కోహ్లి సరసన రోహిత్‌

థాంక్యూ తాప్సీ: మిథాలీ రాజ్‌

మరిన్ని వార్తలు