గప్టిల్‌ నయా రికార్డు

8 Feb, 2020 09:35 IST|Sakshi

ఆక్లాండ్‌:  న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ నయా రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌ తరఫున సొంత గడ్డపై అత్యధిక వన్డే పరుగులు సాధించిన రికార్డును లిఖించాడు. ఈ క్రమంలోనే వెటరన్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈడెన్‌ పార్క్‌ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో గప్టిల్‌ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో గప్టిల్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత స్వదేశంలో అత్యధిక పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  ఇప్పటివరకూ స్వదేశంలో 92 ఇన్నింగ్స్‌ల్లో గప్టిల్‌ 4,023 పరుగులు సాధించాడు. దాంతో రాస్‌ టేలర్‌ రెండో స్థానానికి పరిమితమయ్యాడు. అయితే గప్టిల్‌తో పాటు టేలర్‌ కూడా ఈ మ్యాచ్‌లో ఆడుతుండటం గమనార్హం. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ముందుగా కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను గప్టిల్‌-నికోలస్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించిన తర్వాత నికోలస్‌(41) ఔటయ్యాడు. చహల్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా, గప్టిల్‌ హాఫ్‌సెంచరీతో మెరిశాడు. నికోలస్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బ్లండెల్‌(22) ఎంతో సేపు ఆడలేదు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 27 ఓవర్‌ మూడో బంతికి బ్లండెల్‌ ఔటయ్యాడు. దాంతో 142 పరుగుల వద్ద కివీస్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది.

మరిన్ని వార్తలు