రెండో టెస్ట్‌లోనూ ఓడిన టీమిండియా

2 Mar, 2020 08:20 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: భారత్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. నంబర్‌వన్‌ ర్యాంకులో ఉన్న టీమిండియాను చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమైన కోహ్లి సేన సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు అప్పగించింది. రెండో టెస్ట్‌లోనూ చతికిల పడి ఓటమిని పరిపూర్ణం చేసుకుంది. మూడో రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్‌ను కివీస్‌ 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. విహారి, పంత్‌ పోరాడకుండానే వికెట్లు అప్పగించడంతో లాంఛనం పూర్తయింది. స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ అవలీలగా అధిగమించి విజయాన్ని అందుకుంది.

90/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 124 పరుగులకు ఆలౌటయింది. హనుమ విహారి(9), రిషభ్‌ పంత్‌(4), మహ్మద్‌ షమి(5), బుమ్రా(4)  స్వల్ప స్కోర్లకు అవుట్‌ కావడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. రవీంద్ర జడేజా(16) నాటౌట్‌గా నిలిచాడు. పుజారా(24) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బౌల్ట్‌ 4, సౌతి 3 వికెట్లు పడగొట్టారు. 132 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ 36 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి ఛేదించింది. లాంథమ్‌(52), బ్లన్‌డెల్‌(55) అర్ధసెంచరీలతో రాణించాడు. విలియమ్సన్‌ 5 పరుగులు మాత్రమే చేశాడు. బుమ్రా రెండు పడగొట్టగా, ఉమేశ్‌ యాదవ్‌ ఒక వికెట్‌ తీశాడు. (చదవండి: సలాం జడ్డూ భాయ్‌..)

మరిన్ని వార్తలు