హామిల్టన్: న్యూజిలాండ్ ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా పేస్ బౌలింగ్ విభాగం అదరగొట్టింది. న్యూజిలాండ్ ఎలెవన్ జట్టును 235 పరుగులకే కట్టడి చేసింది. దాంతో టీమిండియా 28 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. మహ్మద్ షమీ మూడు వికెట్లతో మెరవగా, జస్ప్రీత్ బుమ్రా, సైనీ, ఉమేశ్ యాదవ్లు తలో రెండు వికెట్లు సాధించారు. 10 వికెట్లలో 9 వికెట్లు పేస్ బౌలర్లు సాధిస్తే, స్పిన్నర్ అశ్విన్కు వికెట్ దక్కింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.(ఇక్కడ చదవండి: గిల్ గోల్డెన్ డక్.. విహారి సెంచరీ)
రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ ఎలెవన్ ఏ దశలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. న్యూజిలాండ్ ఓపెనర్లలో విల్ యంగ్(2)ను ఆదిలోనే బుమ్రా ఔట్ చేసి మంచి బ్రేక్ ఇచ్చాడు. ఆపై టిమ్ సీఫెర్టీ(9)ని షమీ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.అటు తర్వాత రచిన్ రవీంద్ర(34), ఫిన్ అలెన్(20), హెన్రీ కూపర్(40), టామ్ బ్రూస్(31), మిచెల్(32)లు ఫర్వాలేదనిపించారు. కాగా, వరుస విరామాల్లో భారత్ పేస్ బౌలర్లు వికెట్లు సాధించడంతో న్యూజిలాండ్ ఎలెవన్ రెండొందల మార్కును అతి కష్టం మీద చేరుకుంది.
టీమిండియా తొలి ఇన్నింగ్స్లో చతేశ్వర పుజారా(93), హనుమ విహారి(101 రిటైర్ట్హర్ట్)లు రాణించగా మిగతా వారు విఫలమయ్యారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితం కాగా, అందులో నాలుగు డకౌట్లు ఉండటం గమనార్హం.